Sajjala : టీడీపీకి సలహాదారుగా మారిపోయిన సజ్జల.? ఎందుకంటే.!

Sajjala : వైసీపీ ముఖ్య నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీకి సలహాదారుగా మారిపోయారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి సలహా ఇచ్చేశారు. ఆ సలహా ఏంటంటే, వచ్చే ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్న క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, కుప్పం నియోజకవర్గంలో తాను కాకుండా ఇంకొకర్ని అభ్యర్థిగా నిలబెట్టుకోవాలట.

గత కొద్ది రోజులుగా చంద్రబాబు, ‘నేను మారాను.. పార్టీలోనూ నేతలు తమ ఆలోచనల్ని మార్చుకోవాల్సిందే..’ అంటూ క్లాసులు పీకుతున్న సంగతి తెలిసిందే. గెలుపు గుర్రాలంటూ ఆయా నియోజకవర్గాల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పుపై సంకేతాలిస్తున్నారు. ఈ వ్యవహారమ్మీదనే సజ్జల రామకృష్ణారెడ్డి సెటైరేశారు ‘కుప్పం’లో కూడా అభ్యర్థిని మార్చెయ్యమని.

సెటైర్ అయితే బాగానే పేలిందిగానీ, టీడీపీకి ఉచిత సలహాలు ఇవ్వడం మాని.. ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మీద టీడీపీ సానుభూతిపరులు ట్రోలింగ్ తీవ్రాతి తీవ్రంగా చేసేస్తున్నారు. సినిమా టిక్కెట్ల వివాదం సహా, చాలా వ్యవహారాల్లో ప్రభుత్వం అభాసుపాలవుతోందన్న విమర్శ వుండనే వుంది. సలహాదారులు సరిగ్గా పనిచేస్తే, ప్రభుత్వం జీవోల్ని వెనక్కి తీసుకునే పరిస్థితి వుండదన్న భావన వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా వ్యక్తం చేస్తున్నారు.

కాగా, చంద్రబాబు ఫ్రస్ట్రేషన్‌లో మాట్లాడుతున్నారనీ, వైఎస్ జగన్ ప్రభుత్వమ్మీద బురదచల్లడమే పనిగా పెట్టుకుని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారనీ, టీడీపీ అధినేత మీద సజ్జల రామకృష్ణారెడ్డి విరుచుకుపడ్డారు.