Revanth Reddy : ప్రధాని నరేంద్ర మోడీపై నోరు జారేసిన రేవంత్ రెడ్డి.!

Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా సాహసోపేతమైన నిర్ణయం సోనియాగాంధీ తీసుకున్నారనీ, తెలుగు రాష్ట్రాల్లో పార్టీ నష్టపోతుందని తెలిసీ, తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ హయాంలో ఏర్పాటు చేశారనీ అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పుడాయన కాంగ్రెస్ నేత కదా.. పైగా, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడాయె. అధినేత్రి మీద ఆ మాత్రం గొప్పలు చెప్పకపోతే ఎలా.?

2014 ఎన్నికల్లో ఎటూ గెలిచేది లేదనే నిర్ణయానికి వచ్చాక, అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు దిశగా ముందడుగు వేసింది. ఈ విషయం రేవంత్ రెడ్డికే అందరికన్నా బాగా తెలుసు. ఎందుకంటే, అప్పట్లో సోనియా గాంధీ మీద విమర్శలు చేసినవారిలో అందరికన్నా ముందున్నది రేవంత్ రెడ్డి మాత్రమే.

సరే, విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలుగు రాష్ట్రాల్నిఎలా ముంచేసిందీ అందరికీ తెలిసిందే. మరి, బీజేపీ ఏం చేసింది.? అంటే, అంతకు మించి అన్యాయం చేసింది బీజేపీ. ఈ విషయమై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ప్రధాని మోడీపై మండిపడ్డారు.

‘ఇచ్చిన హామీలు నెరవేర్చని నరేంద్ర మోడీ బంగాళాఖాతంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలి..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి ఇలా నోరు పారేసుకోవడం కొత్తేమీ కాదు. చిచ్చర పిడుగులా చెలరేగిపోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆ నోటి దురదే ఆయనకు శాపంగా మారుతోందనుకోండి.. అది వేరే సంగతి.

ఇక, రేవంత్ వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు సర్వసాధారణమే. అందరూ కలిసి పొలిటికల్ గేమ్ ఆడటం తప్ప, తెలుగు ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించేవారెవరబ్బా.?