సినిమా నిర్మాణ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తున్న రక్షిత్ శెట్టి.. ఎందుకో తెలుసా..?

సాధారణంగా సినిమాలలో నటీనటులు కీలక పాత్రలు పోషిస్తూ ఉంటారు. కానీ కొన్ని సినిమాలలో జంతువులు,పక్షులు, బొమ్మల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఇటీవల విడుదలైన 777 చార్లీ మూవీలో కూడా ఒక శునకం చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. ఈ సినిమాలో ఓ శునకానికీ, ఓ మనిషికీ మధ్య అనుబంధం గురించి గొప్పగా వివరించారు. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా ఇతర భాషలలో కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో కన్నడ నటుడు రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించాడు.

కిరణ్ రాజ్ కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 777చార్లీ సినిమా జూన్ 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. కన్నడ భాషలో నిర్మించిన ఈ సినిమాని తెలుగు,తమిళ,మలయాళం, హిందీ భాషలలో డబ్ చేసి విడుదల చేశారు. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. 20 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు మంచి లాభాలు రావడంతో సినిమా కోసం పనిచేసిన నటీనటులకు సాంకేతిక సిబ్బందికి 10 శాతం మాట ఇవ్వనున్నట్లు హీరో రక్షిత్ శెట్టి ప్రకటించారు.

రక్షిత్ శెట్టి ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా పనిచేశాడు. సాధారణంగా సినిమాలో విజయవంతమై మంచి లాభాలు పొందితే సినిమాలో పనిచేసిన వారికి విలువైన బహుమతులు ఇవ్వడం చూస్తుంటాము. అయితే రక్షిత్ శెట్టి మాత్రం ఈ సినిమాకి వచ్చిన లాభాలలో 10% నటీనటులు, సాంకేతిక సిబ్బందికి అందించగా మరొక 5% దేశవ్యాప్తంగా ఉన్న ఎన్జీవో సంస్థలకు విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ఈ క్రమంలో రక్షిత్ శెట్టి మూగజీవాలను హింసించకుండా వాటిని సంరక్షించాలని… మూగజీవాలను సంరక్షించడానికి పాటుపడుతున్న ఎన్జీవో సంస్థల పట్ల తనకు అపారమైన గౌరవం ఉంది అంటూ రక్షిత్ శెట్టి వెల్లడించారు. ఇలా ఎన్జీవో సంస్థలకు విరాళం ప్రకటించి రక్షిత్ శెట్టి ఇతర నిర్మాతలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నాడు.