మార్పు తప్పదట.! కానీ, చంద్రబాబు ఎక్కడికి మారతారో.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాల్లేవన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే, ‘ఈసారి కుప్పంలో గెలిచి తీరతాం..’ అంటోంది జనసేనాని. వ్యూహాత్మకంగా టీడీపీని దెబ్బ తీసేందుకు, మైండ్ గేమ్ ఆడుతోంది కుప్పం పేరుతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. రాజకీయాల్లో ఇలాంటివన్నీ మామూలే.

అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కూడా మార్పు కోరుకుంటున్నారు. అయితే, కుప్పం నుంచి తన కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు పోటీ చేసేలా చంద్రబాబు వ్యూహ రచన చేస్తున్నారట. అమరావతి వైపుగా చంద్రబాబు ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు.

అమరావతి పరిధిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేసే అవకాశాలున్నాయన్నది తాజా ఊహాగానాల సారాంశం. ఉమ్మడి గుంటూరు అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో రాజధాని అమరావతితో లింక్ వున్న ఏదో ఒక నియోజకవర్గం నుంచి చంద్రబాబు పోటీ చేయబోతున్నారన్నది సుస్పష్టమవుతోంది.

అయితే, ఈ విషయమై టీడీపీ నేతలెవరూ పెదవి విప్పడంలేదు. మంగళగిరి నుంచి నారా లోకేష్ ఇంకోసారి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈసారి లోకేష్ కూడా వేరే ఆలోచనల్లో వున్నారన్నది తాజా ఖబర్. మరి, ఆయన కుప్పం వైపు చూస్తారా.? ఏమో, చూసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

విశాఖ మీద కూడా చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారని అంటున్నారు. సీమ నుంచి బాలయ్య వున్నారనీ, ఉత్తరాంధ్రలోనే కుటుంబ సభ్యులెవరూ లేరన్న కోణంలో అటు వైపుకు లోకేష్‌ని పంపాలన్న ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారట.