చిప్పకూడు తిన్న దరిద్రుడు: రేవంత్ రెడ్డిపై కేటీయార్ తీవ్ర వ్యాఖ్యలు

KTR Controversial Commengs Against Revanth Reddy

KTR Controversial Commengs Against Revanth Reddy

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల బాధ్యతలు తీసుకున్న ఎంపీ రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. ‘చిప్పకూడు తిన్న దరిద్రుడు’ అంటూ వ్యాఖ్యానించారు కేటీయార్.

తెలంగాణ రాష్ట్ర సమితిలోకి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు 2018 ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా ఫిరాయించిన విషయం విదితమే. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాళ్ళతో కొట్టాలంటూ కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు రేవంత్ రెడ్డి.

ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలంతా రేవంత్ రెడ్డిపై దుమ్మెత్తి పోశారు. కాగా, ఎమ్మెల్యలను తెలంగాణ రాష్ట్ర సమితి కొనేసిందంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీయార్, కొనుగోళ్ళ గురించి రేవంత్ మాట్లాడితే హాస్యాస్పదంగా వుంటుందని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా లక్షలాది రూపాయల్ని ఎరగా చూపుతూ ఏసీబీకి అడ్డంగా దొరికిన రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేల కొనుగోళ్ళ గురించి మాట్లాడితే ఎలాగని విమర్శిస్తూ, చిప్పకూడు తిన్న దరిద్రుడంటూ రేవంత్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు సర్వసాధారణమైపోయాయి. వైఎస్సార్ హయాంలో పార్టీ ఫిరాయింపులు జరిగితే, దాన్ని రాజకీయ వ్యభిచారమని తెలంగాణ రాష్ట్ర సమితి అభివర్ణించింది. ఇప్పుడు అదే పార్టీ.. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోంది. రేప్పొద్దున్న కాంగ్రెస్ అధికారంలోకి రావడమంటూ జరిగితే, అప్పుడూ ఫిరాయింపులుంటాయి. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి బాధిత పార్టీ అవుతుంది. అంతమాత్రానికే పెద్ద పెద్ద మాటలెందుకు కేటీయార్ సారూ.? అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.