KCR : తెలంగాణ సీఎం కేసీయార్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా.?

KCR : తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణలో ముందస్తు ఎన్నికల వ్యూహంతోనే రాజకీయాలు చేస్తున్నారా.? జాతీయ స్థాయిలో కొత్త ప్రత్యామ్నాయం పేరుతో కేసీయార్ చేస్తున్న రాజకీయాల వెనుక అసలు కోణమేంటి.? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

రాజ్యాంగాన్ని మార్చేద్దాం.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేద్దాం.. అంటూ జాతీయ స్థాయి నాయకులతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ మంతనాలు జరుపుతున్నారు. గతంలో ఆయన చేసిన ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లకీ, ఇప్పుడు చేస్తున్న పబ్లిసిటీ స్టంట్లకీ తేడా ఏంటంటే, ‘రాజ్యాంగాన్ని మార్చేయడం’. ఇదిప్పుడు ఆయన తెరపైకి తెచ్చిన కొత్త అస్త్రం.

2018లో తెలంగాణలో ముందస్తుగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు కేసీయార్, ‘జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేద్దాం..’ అంటూ తెలంగాణ సమాజంలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. అలా ఆయన రాజకీయంగా తెలంగాణలో లబ్ది పొందిన మాట వాస్తవం.

ఇప్పుడూ కేసీయార్ అదే వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారనీ, అందుకే జాతీయ స్థాయి నాయకులు, కేసీయార్ ప్రతిపాదనల విషయమై ఆచి తూచి స్పందిస్తున్నారనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఢిల్లీ స్థాయిలో మోడీ సర్కారు మీద గుర్రుగా వున్న నాయకుల్లో మమతా బెనర్జీ, కేజ్రీవాల్ తదితరులున్నారు. వాళ్ళతో కేసీయార్ భేటీలు ముందు ముందు జరిగే అవకాశాలున్నాయి. అయితే, జాతీయ స్థాయిలో కొత్త ప్రత్యామ్నాయం.. అంటే, దానికి చాలా పెద్ద కథ వుంది. ఆ విషయం కేసీయార్‌కి కూడా బాగా తెలుసు.

అయినాగానీ, గతంలో చేసిన చీప్ స్టంట్స్ ఇంకోసారి కేసీయార్ చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏమో.!