Janasena New Slogan : ఇదెక్కడి ర్యాగింగ్ మహాప్రభో.! నిజమే, రాజకీయాల్లో ఈ మధ్య క్రియేటివిటీ ఎక్కువైపోయింది. అందునా, పొలిటికల్ ర్యాగింగ్ విషయంలో తగ్గేదే లే.. అన్నట్టు వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు. ఆ పార్టీ, ఈ పార్టీ అన్న తేడాల్లేవ్.. అన్ని రాజకీయ పార్టీలదీ ఇదే తంతు.
అసలు విషయానికొస్తే, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒంగోలు పర్యటనకు వెళితే, సీఎం కాన్వాయ్ కోసం ఆర్టీయే అధికారులు.. తిరుపతికి వెళుతున్న ఓ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారు.. వారి కారుని లాక్కున్నారు. బాధిత కుటుంబం, లబోదిబోమంది.. ఈ ఘటనలో అధికారులపై జగన్ సర్కారు చర్యలకు ఉపక్రమించినా, జరగాల్సిన డ్యామేజ్ అయితే ప్రభుత్వానికి జరిగిపోయింది.
ఈ ఘటనను బేస్ చేసుకుని, జనసేన పార్టీ ఈ నెల 28న విశాఖలో సీఎం పర్యటన నేపథ్యంలో ఆసక్తికరమైన ప్రచారం మొదలు పెట్టింది. ‘విశాఖ వాసులారా మీ కార్లు జర భద్రం.. ఈ నెల 28న సీఎం జగన్ రెడ్డిగారి పర్యటన వున్నది. హఠాత్తుగా మీ కారు సీఎంగారి కాన్వాయ్ కోసం లాగేసుకునే అవకాశం వున్నది.
కావున ముఖ్యమైన పనుల మీద లేదా మహిళలు, పిల్లలతో వెళ్ళేవారు ఆటో లేదా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం మంచిది..’ అంటూ జనసేన పార్టీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ట్వీట్లేస్తున్నారు.
ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం కార్లను ఇలా ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించడం కొత్తేమీ కాదని, ఒంగోలు ఘటన తర్వాత అంతకు ముందు జరిగిన ఇలాంటి ఘటనల్ని ప్రస్తావిస్తూ మీడియా ఆసక్తికరమైన కథనాలు తెరపైకి తెచ్చింది. మరీ అంత దారుణమా.? అని జనం విస్తుపోతున్నారనుకోండి.. అది వేరే సంగతి.
ఇంతకీ, ఈ అప్రతిష్ట నుంచి వైసీపీ ఎలా బయటపడగలుగుతుంది.? వేచి చూడాలిక.