Jagan : స్పెషల్ స్టేటస్ నుంచి త్రీ క్యాపిటల్స్వ దాకా.. జగన్ వ్యూహమిదేనా.?

Jagan : మూడు రాజధానుల విషయమై త్వరలో, అతి త్వరలో కొత్త బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నామని వైసీపీ నేతలు.. అందునా కొందరు మంత్రులు చెబుతోన్న విషయం విదితమే. అయితే, మూడు రాజధానుల విషయాన్ని అధికార పక్షం 2024 ఎన్నికలకు సంబంధించి ప్రధాన ఎజెండా అంశంగా మార్చబోతోందంటూ వైసీపీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది.

2019 ఎన్నికల్లో ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రధాన ఎజెండాగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జనం ముందుకు వెళ్ళిన విషయం విదితమే. 25 మంది ఎంపీలను వైసీపీకి ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ అధినేత చెప్పారు. వైసీపీకి చెందిన చాలామంది నేతలు ఇదే అంశాన్ని జనంలోకి తీసుకెళ్ళారు కూడా.

ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు హయాంలో నిరాహార దీక్ష కూడా చేసిన వైఎస్ జగన్, అధికారంలోకి వచ్చాక మాత్రం, ప్రత్యేక హోదా పేరుతో ఒక్క దీక్ష కూడా చేసింది లేదు. చంద్రబాబు తరహాలో వైఎస్ జగన్ కూడా ముఖ్యమంత్రి దీక్షలు చేయాల్సిందేనా.? అలా చేయడం వల్ల వచ్చే ఫలితం ఏంటి.? అన్నది వేరే చర్చ.

కాగా, ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీయలేని నిస్సహాయత గురించి వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండా వుంటుందా.? ఆయన పరిస్థితిని అర్థం చేసుకున్నారు కాబట్టే, సంయమనం పాటిస్తున్నారన్నది ఓ వాదన.

అప్పుడెలాగైతే ప్రత్యేక హోదాని రాజకీయ అవసరార్థం వైఎస్ జగన్ వాడుకున్నారో, ఇప్పుడు మూడు రాజధానుల అంశాన్నీ ఎన్నికల కోసం వాడుకునేందుకు స్కెచ్ వేస్తున్నారన్న ప్రచారంలో నిజమెంత.? అన్న విషయాన్ని పక్కన పెడితే, 2024 ఎన్నికల వరకూ ఈ వ్యవహారాన్ని నాన్చితే అది వైసీపీకి రాజకీయంగా ‘పాతరేసే’ అంశమే అవుతుందన్నది నిర్వివాదాంశం.