
అసలు రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఎలా అమలవుతున్నాయి.? క్రమం తప్పకుండా షెడ్యూల్ ప్రకారం ఎలా వైఎస్ జగన్ ప్రభుత్వం, ‘మీట నొక్కి’ మరీ సంక్షేమ పథకాల్ని అమలు చేస్తున్నట్లు.? నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బలు వెళ్ళిపోతున్నాయి చాలా సంక్షేమ పథకాలకు సంబంధించి. సామాజిక పెన్షన్లు అయితే, నేరుగా లబ్దిదారుల చేతికి అందుతున్నాయి. జనం జేబుల్లో డబ్బులుంటే, ప్రస్తుత పరిస్థితుల్లో అది వ్యవస్థ మనుగడకీ ఉపయోగపడుతుందన్నది ఓ ఆర్థిక సూత్రం. అయితే, అప్పులు చేసి.. ఈ పప్పు కూడు ఏంటి.? అన్నది ఇంకో ప్రశ్న. కరోనా నేపథ్యంలో దేశంలో అన్ని రాష్ట్రాలూ అప్పులు చేయక తప్పడంలేదు. కేంద్రం కూడా అప్పులు చేస్తూనే వుంది. అలాంటప్పుడు, విభజన కారణంగా కష్టాల్లో వున్న ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో వింతేముంది.? రాష్ట్రంలో అభివృద్ధి అసలే జరగడంలేదన్నది ఇంకో వాదన.
నిజమే, రాష్ట్రంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అలాంటిది. ఈ తరుణంలో సంక్షేమ పథకాలు కూడా అమలు కాకపోతే, రాష్ట్ర ప్రజల పరిస్థితేంటి.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా సంక్షేమ పథకాలతో ప్రజలు సోమరిపోతుల్లా మారిపోతారన్నది నిపుణుల వాదన. దాన్నీ కొట్టిపారేయలేం. కానీ, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఒకే ఒక ఆప్షన్.. సంక్షేమ పథకాల ద్వారా జనం చేతుల్లోకి డబ్బుల్ని పంపించడం. అయితే, అది ఎంతవరకు సత్ఫలితాన్నిస్తుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాగా, వైఎస్ జగన్ ప్రతిసారీ మీట నొక్కుతోంటే.. విపక్షాల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. అదే సమయంలో, ఆ మీట నొక్కడం అనేది.. 2024 ఎన్నికల్లో తమకు ఓట్లను కురిపించేదిగా వుంటుందా.? అన్న అనుమానమైతే అధికార పార్టీలో అలాగే వుంది.
