ఈటెల గెలిస్తే, గులాబీ బాస్ కేసీయార్ పరిస్థితేంటి.?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ గెలిస్తే, గులాబీ బాస్ కేసీయార్ పరిస్థితేంటి.? ఇప్పుడిదే చర్చ రాజకీయ వర్గాల్లో వాడి, వేడిగా జరుగుతోంది. ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం చూస్తే, ఈటెల రాజేందర్ గెలవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

‘ఓటుకు 6 వేల నుంచి 20 వేల రూపాయలదాకా ఖర్చు చేశారు. నన్ను అడ్డుకోవడానికి నానా రకాల ప్రయత్నాలూ చేశారు. చివరికి అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి షాక్ తగలబోతోంది..’ అంటున్నారు ఈటెల రాజేందర్. అది నిజమేనా.? నిజమే అయితే మాత్రం, అది తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి నిజంగానే పెద్ద షాక్ అవుతుంది.

దుబ్బాకలో రఘునందన్, హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్.. అంటూ అప్పుడే బీజేపీ నుంచి హంగామా షురూ అయిపోయింది. రఘునందన్ కూడా ఒకప్పుడు కేసీయార్ మనిషి. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ‘గెంటి వేత’కు గురయ్యారు. ఈటెల కూడా సేమ్ టు సేమ్ అంతే.

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి నేతల తీరు ఇలా వుండేది. తెలుగుదేశం పార్టీ నుంచి గులాబీ పార్టీలోకి వెళ్ళి.. అక్కడ సక్సెస్ అయినోళ్ళు చాలామందే వున్నారు.. అందులో అతి ముఖ్యమైన వ్యక్తి స్వయానా కేసీయార్. ఇప్పుడు ఆయనకూ అలాంటి షాకులే తగలబోతున్నాయని అనుకోవాలేమో.

దళిత బంధు కూడా హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెరపైకొచ్చిన సంక్షేమ పథకమే.. అది కూడా ఈటెల రాజేందర్‌ని దెబ్బ తీయడానికి రూపొందిన పథకం. ఎన్ని ప్లాన్స్ వేసినా.. గులాబీ పార్టీ గెలవకపోతే.. నాయకులకు, పార్టీ మీద నమ్మకం సన్నగిల్లుతుంది. అదే జరిగితే.. గులాబీ పతనం అత్యంత వేగంగా జరుగుతుందన్నది నిర్వివాదాంశం.