పోరు గడ్డపై ఉప పోరు

Eatela story

Eatela story

ఉద్యమాలకు పుట్టినిల్లు తెలంగాణ. ఉద్యమాల పురిటిగడ్డ కరీంనగర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కూడా అప్పట్లో టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు కూడా కరీంనగర్నే సెంటిమెంట్ జిల్లాగా ఎంచుకున్నాడు. ఇక్కడి నుంచే మలి ఉద్యమానికి శ్రీకారం చుట్టాడు కూడా. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్.. కరీంనగర్ సెంటిమెంట్ను మాత్రం వీడలేదు. ఆయన అధికారంలో ఏ పథకం ప్రారంభించినా ఇక్కడి నుంచే ముహూర్తం ఫిక్స్ చేసేవాడు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఎన్నో ప్రాణాలు పోయాయి. ఎన్నో త్యాగాలు చేస్తే తప్ప తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాలేదు. చివరకు ఎన్నికల్లో గెలుపొంది నాయకులు తమ పదవులను సైతం త్యజించారు కూడా. తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున గెలిచి ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ పదవులను తృణప్రాయంగా వదులుకున్నారు. మళ్లీ ఉప ఎన్నికల్లో నిలబడి సత్తాచాటారు.

అందులో.. కేసీఆర్కు నమ్మిన బంటు.. టీఆర్ఎస్ సెకండ్ లీడర్గా పేరొందిన ఈటల రాజేందర్ ఒకరు. రాష్ట్ర సాధనకు ఆది నుంచి కేసీఆర్తో వెంట నడిచిన లీడర్ ఆయన. కేసీఆర్కు నమ్మినబంటు రాజేందర్. అందుకే.. కేసీఆర్ కేబినెట్లో రెండు సార్లు మంత్రిగా అవకాశం కల్పించారు. అందులోనూ.. ప్రాధాన్యం కలిగిన ఆర్థిక శాఖ, వైద్య శాఖలు అప్పజెప్పారు. అంతటి వీరి స్నేహంలో ఒక్కసారిగా పొరపొచ్చాలు వచ్చాయి. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్కు, సీఎం కేసీఆర్ల మధ్య ఆరేళ్లుగా ఇంటర్నల్ యుద్ధం నడుస్తోంది.

దీంతో రాజేందర్ను టార్గెట్ చేసిన సీఎం కేసీఆర్.. అతనిని రాజకీయంగా దెబ్బకొట్టారు. రాజేందర్ ఆస్తులపై ఎంక్వైరీ చేయించారు. చివరకు రాజేందర్ భూములు కబ్జా చేసినట్లుగా నిరూపించగలిగారు. దీంతో చివరకు రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. వీటన్నింటి నేపథ్యంలో రాజేందర్ కూడా పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

అలాంటి ఉద్యమగడ్డ కరీంనగర్ ఇప్పుడు మరోసారి రాష్ట్రవ్యాప్తంగా సంచలనానికి వేదికైంది. ఉద్యమ నేలపై మరో ఉప ఎన్నిక జరగబోతోంది. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ రాజీనామాతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజీనామా చేశాక ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉండగా.. ఏ క్షణాన్నైనా షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఇప్పటికే టీఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ 14న బీజేపీలో చేరబోతున్నారు. కాషాయం కండువా వేసుకోబోతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో బీజేపీ కండువా కప్పుకునేందుకు ఇప్పటికే ఈటల రాజేందర్ తన టీమ్తో ఢిల్లీకి చేరుకున్నారు. ఇక బీజేపీలో చేరి.. మరోసారి సొంత గడ్డపై తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

ఈటల రాజీనామాతో ఇప్పటికే హుజూరాబాద్లో రాజకీయ సమకరణాలు మారుతున్నాయి. హుజూరాబాద్లో ఎలాగైనా గెలువాలని టీఆర్ఎస్ కూడా ఛాలెంజింగ్గా ఉంది. పార్టీలోని సీనియర్లను అక్కడికి రంగంలోకి దింపబోతోంది. అటు బీజేపీ కూడా ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగానే తీసుకొంది. ఇప్పటికే ఆయా పార్టీలు ఆయా మండలాలను ఇన్చార్జీలను సైతం నియమించాయి. దీంతో పోరు రసవత్తరం కానుంది.

ఇదిలా ఉండగా.. ఈటల ఏడో సారి ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటయ్యాక 2004 నాటి శాసనసభ ఎన్నికల్లో కమలాపూర్ నుంచి తొలిసారి గెలుపొందారు. అప్పటివరకు కమలాపూర్లో తిరుగులేని నేతగా ఉన్న ముద్దసాని దామోదర్రెడ్డిని ఓడించి 20 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు.. ఈటల చాన్నాళ్లు కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగానూ కొనసాగారు. టీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగానూ వ్యవహరించారు.

2008లో కేసీఆర్ పిలుపుతో తొలిసారి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 2009లో కమలాపూర్ స్థానం రద్దు కావడంతో తన నియోజకవర్గం హుజూరాబాద్ అయింది. ఇక అప్పటి నుంచి హుజూరాబాద్ ఈటలకు అడ్డాగా మారిపోయింది. అక్కడ తిరుగులేని లీడర్గా ఎదిగిపోయారు.

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రకటన తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి ఈటల కూడా రాజీనామా చేశారు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి ఘన విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కూడా 2014, 2018లోనూ హుజూరాబాద్ నుంచి గెలుపొందారు. మరికొద్ది రోజుల్లో మరోసారి ఉప ఎన్నిక జరగబోతుండగా.. ఈటల తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తంగా తెలంగాణ పోరు గడ్డపై మరో ఉప ఎన్నిక జరగబోతోంది.