
కరోనా రెండో వేవ్ ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అయితే, థియేటర్లు ఇటీవల తెరచుకోవడంతో రెండు చిన్న సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చాయి. హమ్మయ్యా.. అని తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. ఇంతలోనే పిడుగు లాంటి వార్త.. అదే, దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గిపోలేదు.. అలాగే వుంది.. పైగా, పాజిటివిటీ రేటు పెరుగుతోందన్న హెచ్చరిక తెలుగు సినీ పరిశ్రమను కలచివేస్తోంది. ఆగస్ట్ నెలలో ఓ మోస్తరు స్థాయి సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కోవిడ్ 19 భయాలు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
ఇటీవల ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. తనకు అవకాశం ఇచ్చిన నిర్మాతలు తనను క్షమించాలంటూ ఆయన విజ్ఞప్తి చేశారు. కోవిడ్ సోకడంతో, ఆయా సినిమాల షూటింగులు పోస్ట్ పోన్ అవక తప్పని పరిస్థితి ఏర్పడింది మరి. ఇదిలా వుంటే, తెలుగు రాష్ట్రాల్లో బోనాల వేడుకల సందడి కనిపిస్తోంది. దాంతోపాటుగా, పర్యాటక ప్రాంతాలూ కళకళ్లాడుతున్నాయి. కరోనా వ్యాప్తికి ఇంతకన్నా గొప్ప అవకాశం ఇంకేముంటుంది.? తెలంగాణలో వీకెండ్ లాక్ డౌన్ దిశగా ప్రయత్నాలంటూ మీడియాలో కథనాలు షురూ అయ్యాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అలాంటి వార్తల్ని కొట్టి పారేస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అయితే థియేటర్లలో 50 శాతం సామర్థ్యంతోనే సినిమాల ప్రదర్శనలకు అనుమతిచ్చిన విషయం విదితమే. మొదటి వేవ్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమ, రెండో వేవ్ కారణంగా మరింత కుదేలయ్యింది. ఇంకోసారి కరోనా భయమంటే.. ఈసారి సినీ పరిశ్రమ కోలుకోవడం దాదాపు అసాధ్యం.
