కరోనా ప్రైవేటు దోపిడీ: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?

Corona Virus

Corona Virus

ప్రభుత్వాలేమో కరోనా వైరస్ బాధితుల చికిత్సకు సంబంధించి రేట్లు ఫిక్స్ చేసేశాయి. సీటీ స్కాన్ ఫలానా ధరకే చేయాలి.. టెస్టుల కోసం ఫలానా మొత్తం మాత్రమే వసూలు చేయాలి.. ఆక్సిజన్ బెడ్ కోసం ఇంత ఖర్చు.. వెంటిలేటర్ పెడితే ఫలానా మొత్తంలో ఖర్చు.. అంటూ ప్రభుత్వాలు పక్కాగా లెక్కలు చెబుతున్నాయి.. స్పష్టమైన ఆదేశాలిస్తున్నాయి. కానీ, ప్రభుత్వాల ఆసుపత్రుల్ని చాలా ప్రైవేటు ఆసుపత్రులు లెక్క చేయడంలేదు. తనిఖీలు అడపా దడపా జరుగుతున్నాయి.. ప్రభుత్వాల ఆదేశాల్ని లెక్క చేయని ఆసుపత్రులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకోబడుతున్నాయి.

కానీ, దోపిడీ మాత్రం ఆగడంలేదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అనుకుంటున్నారేమో.. లేదంటే, కరోనా వున్నప్పుడే కాసుల పంట పండించుకోవాలని కక్కుర్తి పడుతున్నారేమో.! దోపిడీ మాత్రం కనీ వినీ ఎరుగని స్థాయిలో జరుగుతోంది. ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద ఉచిత చికిత్స.. అని ప్రభుత్వం చెబుతున్నా, తెరవెనుక దోపిడీ మాత్రం తప్పడంలేదు. ఆరోగ్యశ్రీ లేనివారి దుస్థితి మరీ దారుణం. లక్షలకు లక్షలే దోచేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. ముందస్తుగా అనవసరపు మందుల వినియోగం, ఆ తర్వాత తలెత్తే అనారోగ్య సమస్యలు.. ఇలా కరోనా బాధితుల్ని ఓ రేంజిలో దోచేస్తున్నాయి ప్రైవేటు ఆసుపత్రులు. ‘ఆసుపత్రికి వెళ్ళడం కంటే ఛావడం నయం..’ అనే భావనకు కొందరు వచ్చేస్తున్నారు. అంతే మరి, కుటుంబ పెద్ద ఆసుపత్రి పాలైతే, అప్పల పాలైపోవడం తప్ప.. ఆ కుటుంబ పెద్ద తిరిగి ప్రైవేటు ఆసుపత్రి నుంచి ప్రాణాలతో వచ్చే పరిస్థితి లేదన్న భావన బలపడిపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. నిజానికి దేశవ్యాప్తంగా కూడా పరిస్థితులు ఇంతకన్నా భిన్నంగా ఏమీ లేవు. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించి, దేశంలోని ప్రైవేటు ఆసుపత్రులన్నిటినీ తాత్కాలికంగా ప్రభుత్వాలు తమ ఆధీనంలోకి తీసుకుంటే తప్ప.. సామాన్యుడికి వైద్యం పరంగా న్యాయం జరిగేలా కనిపించడంలేదు.