ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సంక్షేమ కార్యక్రమాల్లో దేశంలోనే నెంబర్ వన్ గా దూసుకుపోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇతర రాష్ర్టాల సీఎంలకన్నా జగన్ భిన్నంగా వెళ్తూ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రపంచాన్ని అల్లాడిస్తోన్న మహమ్మారి కరోనా వ్యాప్తి సమయంలోనూ సంక్షేమ కార్యక్రమాలు అమలు పరచడంలో జగన్ దూకుడు అసాధారణంగానే ఉంది. రాష్ర్ట ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా జగన్ స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. మాట తప్పడు..మడమ తిప్పడు అన్న దానికి పర్యాయపదంలా నిలిచారంటూ కితాబులందుకుటున్నారు. కొన్ని కొన్ని సంక్షేమ కార్యక్రమాల అమలులో విమర్శలు ఎదుర్కున్నప్పటికీ అంతిమంగా జగన్ ది బెస్ట్ సీఎం అనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 3,38,144 గృహాల గత ప్రభుత్వ బకాయిలను క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా జూలై 8న ఇళ్ల పట్టాల పంపినీ కార్యక్రమం ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలోనే 1323 కోట్ల రూపాయలు గల గృహ బకాయిలను పేదలకు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. దీనిపై పేద వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పేదల పాలిట అసలైన పాలకుడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులు, పరిపాలనా రాజధాని అమరావతి మార్పుపై ఇటీవల కొంత వ్యతిరేకత వ్యక్తమైన సంగతి తెలిసిందే.
అలాగే కరెంట్ బిల్లులు అధికంగా రావడంపై జగన్ పై అదే స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. సింగిల్ బలుబు ఉన్న ఇంటికి కూడా నెలవారి కరెంట్ బిల్లు 400,1000,2000 రూపాయల బిల్లులు వచ్చాయి. విద్యుత్ బిల్లులు పెంచము అని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడా నిబంధనలను తుంగలోకి తొక్కింది అన్న విమర్శ అదే స్థాయిలో వినిపిస్తోంది. అయితే వీటిపై మళ్లీ పునః పరిశీలించుకుంటామని ప్రభుత్వం తెలిపింది. కానీ ఇప్పటివరకూ ఆదిశగా చర్యలు తీసుకోలేదు. కరెంట్ బిల్లులు కట్టే కార్యక్రమం అయితే జరుగుతోంది.