ప్రతిపక్షంలో వున్నప్పుడు అధికార పక్షం మీద విమర్శలు చేయడం ఎవరికైనా మామూలే. గతంలో వైఎస్ జగన్ అదే చేశారు.. ఇప్పుడు చంద్రబాబూ అదే చేస్తున్నారు. కాకపోతే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ.. చంద్రబాబుకీ చాలా తేడా. వైఎస్ జగన్ ఉడుకు రక్తం.. చంద్రబాబు అలా కాదు. పైగా, ‘హుందాతనం, బోల్డంత అనుభవం’ అని చెబుతుంటారు చంద్రబాబు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద చంద్రబాబు దూషణల గురించి కొత్తగా చెప్పేదేముంది.? వైసీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టడమే చంద్రబాబు ఎజెండా. వైసీపీ శ్రేణులు రెచ్చిపోయి, దాడులకు దిగితే, సింపతీ పొందాలని చంద్రబాబు చూస్తుంటారు. కుప్పం పర్యటనలో చంద్రబాబు చేసింది అదే. చంద్రబాబు సాధించింది కూడా ఆయన ఏదైతే ఆశించారో.. అదే.!
చంద్రబాబుపై దాడి, చంద్రబాబుపై హత్యాయత్నం.. అనేంతలా కుప్పంలో సీన్ క్రియేట్ అయ్యింది. ఆ స్థాయిలో టీడీపీ శ్రేణులు ప్రచారం చేసుకున్నాయి. టీడీపీ అనుకూల మీడియా కూడా అదే హంగామా చేసింది. టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడులే హైలైట్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులు ఎవరికీ కనిపించడంలేదు.
మొత్తమ్మీద, చంద్రబాబు తాను అనుకున్నది సాధించారు. ఎన్ఎస్జీ నుంచి చంద్రబాబు అదనపు భద్రత పొందారు. అంటే, ఏపీ పోలీసుల వైఫల్యాన్ని ఆయన ప్రొజెక్ట్ చేయగలిగారన్నమాట. నిజానికి, ఇలాంటి విషయాల్లోనే వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి వుండాల్సింది. సీఎం జగన్కి ఈ విషయంలో సరైన సలహా ఎవరూ ఇచ్చి వుండకపోవచ్చు.
ప్రతిపక్ష నేతకు భద్రత ప్రభుత్వమే కల్పించాలి. పోలీసులూ, ప్రతిపక్ష నేత మీద ఈగ వాలకుండా చూసుకోవాలి. కానీ, దురదృష్టం.. ఏపీలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీ కార్యక్రమంలోకి ఇంకో రాజకీయ పార్టీ చొచ్చుకెళుతోంది. ఫలితం, అధికార పక్షం అభాసుపాలైపోయింది. చంద్రబాబుకి కావాల్సిందీ అదే.!
