Chandrababu : అతి త్వరలో నారా లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు బస్సు యాత్ర.?

Chandrababu and Lokesh

Chandrababu and Lokesh : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. జనంలోకి వెళ్ళేందుకు సమాయత్తమవుతున్నారు. ఒకరు పాదయాత్ర ద్వారా, ఇంకొకరు బస్సు యాత్ర ద్వారా రానున్న రెండేళ్ళూ జనంలోనే వుంటారట చంద్రబాబు, నారా లోకేష్.

వృద్ధాప్యం నేపథ్యంలో పాదయాత్ర ఆలోచన చంద్రబాబు చేయలేకపోతున్నారు. గతంలో ఆయన పాదయాత్ర చేసినా, ఆ సమయంలో ఆయన ఆరోగ్యపరమైన సమస్యలు చాలానే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ఆలోచన చేయొద్దని కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నేతలూ చంద్రబాబుకి సూచించినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే, నారా లోకేష్ మాత్రం పాదయాత్రకు సమాయత్తమవుతున్నారట. అతి త్వరలోనే ముహూర్తం ఖరారు కాబోతోందని సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభమై.. రాజధాని అమరావతిలో పాదయాత్ర ముగిసేలా.. రాష్ట్రమంతా ఈ పర్యటన వుండేలా.. పాదయాత్రను డిజైన్ చేసే పనిలో లోకేష్ టీమ్ వుందని అంటున్నారు.

మరోపక్క, టీడీపీ అధినేత చంద్రబాబు టూర్, సొంత నియోజకవర్గం కుప్పం నుంచి ప్రారంభమవుతుందట. లేదంటే, వేరే ఎక్కడి నుంచైనా ప్రారంభించి కుప్పంలో ముగించాలనే ఆలోచన కూడా చంద్రబాబు చేస్తున్నారట.

చంద్రబాబు బస్సు యాత్ర కోసం ప్రత్యేకంగా ఓ బస్సుని డిజైన్ చేయించబోతున్నారని సమాచారమ్. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.