కేసీయార్‌ని బరాబర్ టచ్ చేస్తాం: బండి సంజయ్

‘నా తల ఆరు ముక్కలు కాదు, అరవై ముక్కలైనాసరే.. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. కేసీయార్‌ని టచ్ చేసి తీరతాం.. సరైన సమయంలో టచ్ చేస్తాం..’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘నన్ను టచ్ చేసే ధైర్యముందా.? ఆరు ముక్కలువుతవ్..’ అంటూ బండి సంజయ్‌కి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కేసీయార్ వ్యాఖ్యలపై బండి సంజయ్ పై విధంగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే అత్యంత అధ్వాన్నంగా వున్నాయనుకుంటే, అంతకు మించిన స్థాయిలో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి. ముఖ్యమంత్రి కేసీయార్ తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారు.. బీజేపీ నేతల సంగతి సరే సరి.

ముఖ్యమంత్రి హోదాలో వున్న వ్యక్తి, ఓ జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని ఉద్దేశించి ‘ఆరు ముక్కలవుతవ్..’ అనడం అస్సలేమాత్రం సమర్థనీయం కాదు. అదే సమయంలో, కేసీయార్ మీద బండి సంజయ్ ‘తాగుబోతు’ అంటూ చేస్తున్న వ్యాఖ్యలూ సమర్థించకూడనివే.

‘నయా నిజాం’ కేసీయార్‌ని గద్దె దించుతామని తాజాగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికి కారణమవుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. ఈ మాటల యుద్ధంలో కొత్త కొత్తగా ఎలాంటి పదజాలం వినాల్సి వస్తుందోగానీ.. తెలంగాణ సమాజం దృష్టిలో రెండు పార్టీలూ పలచనైపోతున్నాయన్నది నిర్వివాదాంశం.