తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అప్పులు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్న అప్పులు.! ఈ అంశంపై గత కొంతకాలంగా పెద్ద రచ్చే జరుగుతోంది. ‘అప్ప-డే’ తెల్లారిందా.. అంటాడు ఓ సినిమాలో కామెడీ హీరో రాజేంద్ర ప్రసాద్.
ప్రభుత్వాలదీ అదే పరిస్థితి. తెల్లారితే అప్పులు చేయాల్సిందే.. అప్పులు చేయకపోతే, ఇటు రాష్ట్రాలు, అటు దేశం ముందుకు నడిచే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రమూ అప్పలు చేయకుండా ముందడుగు వేయలేదు. అప్పు చేయని వాడు గాడిద.. అన్నట్టు తయారైంది వ్యవహారం.!
2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో జరిగిన అప్పులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి 2014 వరకూ జరిగిన అప్పుల కంటే ఎక్కువ.. అని అప్పట్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి పక్ష నేతగా వున్నప్పుడు విమర్శలు చేస్తూ వచ్చారు.
మరి, ఇప్పుడు ఏం జరుగుతోంది.? చంద్రబాబు రికార్డుల్ని వైఎస్ జగన్ సర్కారు బ్రేక్ చేసేసి.. సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. అను నిత్యం అప్పుల కోసం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెంపర్లాడుతున్నారు. తప్పదు, ఉద్యోగుల జీతాలు ఇవ్వాలన్నా, వైఎస్ జగన్ బటన్ నొక్కి సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలన్నా.. అప్పులు చేసి తీరాల్సిందే.
రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటే కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి. వాస్తవ పరిస్థితి ఇంత స్పష్టంగా కళ్ళకు కనిపిస్తున్నా, ‘చంద్రబాబు హయాంతో పోల్చితే మా హయాంలో అప్పు శాతం తక్కువ..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా ఓ బహిరంగ సభలో చిత్ర విచిత్రమైన లెక్కలు చెప్పారు.
ప్రభుత్వం చేసే అప్పులు దాచి పెట్టడానికి వీలుండదు. అన్ని లెక్కలూ పక్కాగానే వుంటాయి. అప్పు చేసి, ఆ నిధులు ఏం చేస్తున్నారు.? అన్నదానిపై గందరగోళం వుంటుందేమోగానీ, చేసిన అప్పులకు లెక్కలు పక్కాగా వుండాలి.. ఎందుకంటే, చెల్లింపులు చేయకపోతే ఊరుకోరు గనుక.
మరి, ఇంత స్పష్టంగా అప్పుల భారం కనిపిస్తున్నా, ‘మేం తక్కువే చేశాం’ అని ముఖ్యమంత్రి ఎలా చెప్పగలుగుతున్నారబ్బా.?
