ఎన్టీయార్‌తో కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ వెనుక రాజకీయమేంటి.?

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీయార్ చాలా బాగా నటించాడు. సినిమా ఘనవిజయం సాధించింది. ఆ సినిమాలోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. ఆయన నటనకూ ప్రశంసలు దక్కాయి. కానీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేవలం యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని మాత్రమే డిన్నర్ మీటింగుకి ఆహ్వానించడమేంటి.?

ఇది కాస్త ఆలోచించాల్సిన విషయమే.! ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌కి ఇటీవల రాజ్యసభ పదవి ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కారు. అదీ రాష్ట్రపతి కోటాలో. అప్పుడే, తెలుగు రాష్ట్రాలపై బీజేపీ చేయబోతున్న రాజకీయమేంటో అందరికీ అర్థమయిపోయింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో మునుగోడు బహిరంగ సభ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిక.. అనే అంశాల కంటే, ఎన్టీయార్‌తో అమిత్ షా భేటీ అనే అంశమే ఎక్కువ హైలైట్ అవుతోంది. చిన్న విషయమేమీ కాదిది. బీజేపీ పక్కా ప్లానింగ్‌తోనే వుందన్నమాట తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలపై.

యంగ్ టైగర్ ఎన్టీయార్ పట్ల టీడీపీలో కొందరు అసహనంతో వున్నారు. ఆ మాటకొస్తే, ఎన్టీయార్‌ని తొక్కేసేందుకు టీడీపీలో చాలామంది ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వుంటారు. అదే సమయంలో, యంగ్ టైగర్ ఎన్టీయార్‌ని హైలైట్ చేసేందుకు చాలామంది ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూనే వున్నారు. ఈ తక్కెడలో ఎన్టీయార్ ఫాలోయింగ్ ఎక్కువేనని బీజేపీ తేల్చినట్టు కనిపిస్తోంది.

ఎన్టీయార్‌ని ఏ రకంగా తమ వైపుకు తిప్పుకున్నా, రాజకీయంగా తెలుగు రాష్ట్రాల్లో తమకు లాభమని భావించే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి, ఆయనతో భేటీకి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత ఖచ్చితంగా, తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయాలకు సంబంధించి కొత్త సమీకరణాలు చోటు చేసుకునే అవకాశం వుంటుంది.