Amaravati : అమరావతి రగడ: డబ్బుల్లేవ్.! మేమేటి సేత్తాం.?

Amaravati : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ‘తగ్గేదే లే’ అంటోంది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో ప్రభుత్వం మూడు రాజధానుల విషయమై వెనకడుగు వేస్తుందనీ, అమరావతి అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తుందని చాలామంది భావిస్తే.. అంత సీన్ లేదన్నట్టుగా అధికార పార్టీ నేతలు.. అందునా మంత్రులు వ్యవహరిస్తున్నారు.
‘ఆరు నెలల్లో మౌళిక సదుపాయాల కల్పన సాధ్యమేనా.?’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దీర్ఘాలు తీసిన విషయం విదితమే. తాజాగా హోంమంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, మూడు రాజధానుల అంశంపై హైకోర్టు తీర్పుని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ప్రకటించేశారు.
సరే, రాష్ట్ర ప్రభుత్వం తగ్గేదే లే.. అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించిందే అనుకుందాం. అప్పుడు కూడా హైకోర్టు తరహాలోనే తీర్పు వస్తే ఏంటి పరిస్థితి.? ఈలోగా నడిచే జాప్యానికి ఎవరు బాధ్యత వహిస్తారు.? గడచిన మూడేళ్ళుగా అమరావతిలో అభివృద్ధి ఆగిపోయింది. ఇంకో ఆరు నెలలో, ఏడాదో రాజధాని వ్యవహారం తేలకుండా వుంటే.. నష్టం రాష్ట్ర ప్రజలకే.
నిజమే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో అమరావతి ప్రాజెక్టు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయలేదు. దానికి ప్రత్యామ్నాయమేంటి.? అన్నది కదా ఆలోచించాల్సిందిప్పుడు.! కానీ, ఆ దిశగా వైఎస్ జగన్ సర్కారు ఆలోచన చేస్తున్నట్టు లేదు. ఆలోచన వుంటే, మార్గం దానంతట అదే దొరుకుతుంది. ఇక్కడ కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే.
అమరావతిని సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్టుగా చంద్రబాబు అభివర్ణించారు. అదెలాగో చంద్రబాబు అప్పట్లో వివరించలేకపోయారు. ఇప్పుడన్నా, ఇదిగో.. నిధుల అవసరం లేకుండా అమరావతిని ఇలా ముందుకు తీసుకెళ్ళొచ్చని చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపక్ష నేత హోదాలో సలహా ఇస్తారా.? ఇస్తే, దాన్ని ప్రభుత్వం స్వీకరిస్తుందా.?