గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. ఏ పత్రిక తిరగేసినా.. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా.. ఏ రాజకీయ నాయకుడిని కదిలించినా కచ్చితంగా వినిపిస్తోన్న మాట.. జగన్ తెరపైకి తెచ్చిన రాజధాని విస్తరణ “మావిగన్” అంశం.
అయితే.. ఓ వర్గం కూటమి నేతలు, వారి అనుకూల మీడియా, కొంతమంది స్వయంప్రకటిత మేధావులూ అందుకు ఏమాత్రం అంగీకరించడం లేదు సరికదా.. మావిగన్ మాటెత్తితే చాలు ఎర్రెత్తిపోతున్న పరిస్థితి!
ఈ సమయంలో… ‘మావిగన్ కి ఎస్’ అని ఎవరైనా అంటే.. అది ‘అమరావతికి నో’ అని చెప్పినట్లు కాదనే విషయం ప్రజలకు అర్ధమయ్యేలా జగన్ & కో చెప్పలేకపోతున్నారా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది.
పందిని చూపి నంది అని చంద్రబాబు అంటే.. ‘అవును’ అని పెద్ద పెద్ద హెడ్డింగులు పెట్టే పత్రికలు.. నందిని చూపి పంది అంటే కూడా అదీ నిజమని నమ్మించే ఛానళ్లు సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న నేటి పరిస్థితుల్లో… మావిగన్ కు ఎస్ అని అంటే అది అమరావతిని నో అని చెప్పినట్లే అని ఇప్పటికే జనాల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం బలంగా జరుగుతుంది!
దీంతో… మావిగన్ కు ‘ఎస్’ అని అనాలని భావించిన చాలామంది.. అలా అని అంటే.. తాము అమరావతికి వ్యతిరేకం అనే ముద్ర పడుతుందేమో అనే సందేహాల్లో నిండిపోయిన పరిస్థితి!
పైగా… జగన్ చెప్పిన మావిగన్ అయినా, చంద్రబాబు & కో పాడుతున్న అమరావతి అయినా.. అన్నీ సీఆర్డీఏ పరిధిలోకే వస్తాయనే చిన్న విషయాన్ని బయటకు రాకుండా ఓ వర్గం మీడియా బలంగా నొక్కి పెడుతుంది. మావిగన్ అంటే అది అమరావతికి వ్యతిరేకం అనే ప్రచారాన్ని బలంగా ప్రచురిస్తుంది.. ప్రసారం చేస్తోంది.
ఏపీ వాసుల దౌర్భాగ్యం ఏమిటంటే… ఈ విషయం తెలిసిన స్వయం ప్రకటిత మేధావులు కొంతమంది సైతం… ఇదే వెర్షన్ ని బలంగా ప్రకటించేస్తున్నారు. మావిగన్ అనడం తుగ్లక్ చర్య అని ఓ మేధావి వ్యాఖ్యానించిన పరిస్థితి.
అలా కాకుండా… ‘మావిగన్ కూడా అమరావతి రాజధాని ప్రాంతంలోని భాగమే… మావిగన్ అని అంటే అందులో అమరావతి లేదని కాదు’ అని చెప్పలేక.. తమ మేధావితనాన్ని కీకరకాయగా మార్చుకుంటున్న స్థితి!
ఈ నేపథ్యంలోనే జగన్ తో పాటు ఆయనకున్న బలహీనమైన మీడియా, బలమైన సోషల్ మీడియా, వాక్ చాతుర్యం ఉన్న నేతలు, మావిగన్ కు మద్దతు పలికే మేధావులు, నిపుణులు, విద్యావంతులు, ఒకటి రెండుగా మాత్రమే ఉన్నట్లు చెబుతోన్న న్యూట్రల్ మీడియా ఛానళ్లు అంతా కలిసి… మావిగన్ అని అంటే అది అమరావతికి వ్యతిరేకం కాదు అనే విషయాన్ని నొక్కి చెప్పాలి.
పూర్తిగా చంద్రబాబును నమ్మి భూములిస్తున్న అమరావతి ప్రాంతంలోని కొంతమంది రైతులు, ఓ వర్గం ప్రజానికంతో పాటు విజ్ఞులైన రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమయ్యేలా విచరించాలి.
అలా కానిపక్షంలో… చంద్రబాబు పందిని చూపి నంది అంటే నంది అని.. నందిని చూపి పంది అంటే అవును పంది అని అచ్చేసే మీడియా తన పనిని మరింత బలంగా చేసుకుపోయే ప్రమాదం లేకపోలేదు! ఎందుకంటే నిజం చెప్పులేసుకునేలోపు.. అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుందంట!
2024 ఎన్నికలకు ముందు జగన్ & కో చేసిన తప్పిదాల్లో ఇదొకటి. పలు కీలక విషయాల్లో చంద్రబాబు & కో చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టడంలో జగన్ & కో పూర్తిగా విఫలమయ్యింది! ఆయనకు మద్దతుగా నిలిచినట్లు చెప్పే ఓ వర్గం మీడియా సైతం.. జగన్ భజనకే పెద్ద పీట వేసింది తప్ప.. చంద్రబాబు & కో చేసిన ప్రచారంలో మరో కోణాన్ని జనాల్లోకి తీసుకెళ్లలేకపోయింది! దాని ఫలితమే 151 నుంచి 11 కి పడిపోవడం!
ఎందుకంటే… ఎన్టీఆర్ అంతటి మహానుభావుడిని, తనకు పిల్లనిచ్చిన మావగారిని, రాష్ట్రం మొత్తం “అన్న” అని పిలుచుకునే వ్యక్తినే.. చివరి దశలో ఏ స్థాయిలో మానసిక క్షోభకు గురిచేశారో.. పత్రికల్లో ఎలాంటి నగ్న కార్టూన్లు వేయించారో తెలుగు ప్రజానికానికి తెలియంది కాదు! లక్ష్మీ పార్వతిని అడిగితే మరింత వివరంగా చెబుతారు!
ఈ విషయాన్ని చంద్రబాబు టీడీపీలోని కార్యకర్తలు మరిచిపోయినా.. అసలు సిసలు అన్నగారి అభిమానులు ఈ జన్మకు మరిచిపోయే అవకాశాలు లేవనే చెప్పాలి.
ఇలా తాను అనుకున్నది సాధించే విషయంలో.. తన ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి పాల్పడటానికి.. వారిని మానసిక క్షోభకు గురి చేయడానికి.. చంద్రబాబు ఎంతకైనా తెగించగలరని ప్రత్యర్థులు చెబుతోన్న వేళ.. మావిగన్ విషయంలోనూ అలాంటిపనే చేయబోతున్నారు.. కాదు కాదు.. ఇప్పటికే మొదలుపెట్టారు!
అందుకే… జగన్ & కో ఇప్పటికైనా… మావిగన్ కు ఎస్ అంటే అమరావతికి నో అని కాదు… అమరావతి కూడా మావిగన్ లో భాగమే అని జనాల్లోకి బలంగా తీసుకెళ్లగలగాలి.
అవసరమైతే రాజధానికి అమరావతి పేరే ఉంచుదాం.. కాకపోతే… ఒకే చోట అన్ని లక్షల కోట్లు ఖర్చు సాధ్యం కాదు కాబట్టి.. మచిలీపట్నం నుంచి గుంటూరు వరకూ ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాన్ని రాజధానిలో కలిపి విస్తరిద్దాం అని వివరించాల్సిన బాధ్యత వైసీపీ నేతలపైనా, కార్యకర్తలపైనా, సోషల్ మీడియా సైన్యం పైనా కచ్చితంగా ఉంది.
ఈ విషయంలో ఏమాత్రం ఆలస్యం చేసినా… బాబు & కో… నందిని పంది, పందిని నంది అని నమ్మించే విషయంలో ఏమాత్రం ఆలస్యం చేయరు!
