Crime News: ఒక్క వైన్ బాటిల్ కోసం 49 వేల రూపాయలు పోగొట్టుకున్న యువతి… ఎలాగంటే?

Crime News : ఈ రోజుల్లో ప్రజలకు కష్టం లేకుండా అన్ని వస్తువులు ఇంటి వద్దకే వస్తున్నాయి. మార్కెట్ కి వెళ్లి వస్తువులు కొనడానికి సమయం వృధా చేయకుండా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ ద్వారా ఎవరికి కావాల్సిన వస్తువులు ఇంటికి తెప్పిస్తున్నారు . అకౌంట్ లో డబ్బులు ఉంటే చాలు లక్షల రూపాయలు కూడా ఇంట్లో కూర్చొని కర్చు చేయవచ్చు. కానీ కొందరు కేటుగాళ్లు దీనిని ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటన బెంగళూరులో వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళితే…బెంగళూరులోని లాల్‌బాగ్‌రోడ్డు అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న 22 ఏళ్ల యువతి.. కిందటి నెల 22వ తేదీన ఒక వెబ్ సైట్ ద్వారా తనకిష్టమైన వైన్ ఆర్డర్ ఇచ్చింది. వైన్ కోసం రూ. 540 ఆన్లైన్లో చెల్లించింది. కొంత సమయం తర్వాత సదరు యువతికి ఒక కొత్త నెంబర్ నుండి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మీ ఆర్డర్ కన్ఫామ్ అయిందని, డెలివరీ ఖర్చుల కోసం పది రూపాయలు చెల్లించాలని చెప్పాడు. ఆర్డర్ కోసం మీ మొబైల్ కి ఒక ఓటిపి వస్తుందనీ అది చెప్పాలి అంటూ ఆమెను కోరాడు.

అగంతకుడు చెప్పిన మాటలను నమ్మిన యువతి తన ఫోన్ కి వచ్చిన ఓటీపీ అని అతనితో చెప్పింది. కొంతసేపటి తర్వాత బ్యాంక్ అకౌంట్ చెక్ చేయగా అకౌంట్లో ఉన్న 49 వేల రూపాయలు మాయమయ్యాయి. ఈ తరుణం తో తాను మోసపోయానని గమనించిన సదరు యువతి ఈ ఘటన గురించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.