ప్చ్..  రేవంత్ ఎవ్వర్నీ వదలడం లేదుగా !       

తెలంగాణకి భవిష్యత్తులో సీఎం అవుతాడనుకునే వ్యక్తుల్లో ముఖ్యమైన వాళ్ళు  కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అండ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే  వీరిద్దరి మధ్య కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ కొద్ది రోజులుగా రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.  కేటీఆర్ తన ఫౌంహౌజ్ కోసం అక్రమంగా చెరువును పూడ్చి వేసి రోడ్డు వేసుకున్నారని ఆరోపిస్తూ రేవంత్ రెడ్డి గ్రీన్ ట్రీబ్యూనల్ లో ఫిర్యాదు చేయడం, ఆ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులకు జారీ చేసిన సంగతి తెల్సిందే.
 
అయితే దీని పై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. అయినా  కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూను రేవంత్ రెడ్డి ఇప్పట్లో వదిలేలా కన్పించడం లేదు.  ఈ కేసుతో సంబంధం ఉన్న పోలీసుల పై కూడా తాజాగా ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడం విశేషం. డ్రోన్ కేసులో తనను అరెస్టు చేయడానికి ముందుగా పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేయకుండా అరెస్టు చేయడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు. మాదాపూర్ ఏసీపీ శ్యాంప్రసాదరావు, నార్సింగి ఇన్స్ పెక్టర్ గంగాధర్ ల పై కోర్టు ధిక్కరణ కింద రేవంత్  పిటిషన్ దాఖలు చేశారు.
 
నిజానికి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం పోలీసులు రేవంత్ ను  అరెస్టు చేయడానికి ముందుగా 41ఏ నోటీసులు ఇవ్వాలి.  కానీ  పోలీసులు రేవంత్ కు 41ఏ నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం కోర్టు ధిక్కరణకు కిందకే వస్తుంది. ఆ రకంగా  సుప్రీం కోర్టు తీర్పును  పోలీసులు ఉల్లంఘించారని రేవంత్ ఆరోపణల్లో  విషయం ఉంది. మరి  పోలీసుల పై ధిక్కరణ పిటిషన్ కింద కోర్టు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మొత్తానికి రేవంత్ ఎవ్వర్నీ వదలడం లేదు.