ఎంపిల అనర్హతపై ఫిర్యాదు..టిడిపికి షాక్

చంద్రబాబునాయుడు అండ్ కో పై బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ రమేష్ వెంటపడ్డారు. అవకాశం దొరికితే చాలు చంద్రబాబుతో పాటు ఎవ్వరినీ వదిలిపెట్టటం లేదు. తాజాగా టిడిపి రాజ్యసభ సభ్యులు సిఎం రమేష్, సుజనా చౌదరిని కూడా విడిచిపెట్టకుండా వెంటాడుతున్నారు. అందులో భాగంగానే తెలుగుదేశంపార్టీ రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ పై వెంటన అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.  అంతేకాదు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోపిడి చేసినందుకు వెంటనే వాళ్ళిద్దరినీ అనర్హులుగా ప్రకటించాలంటూ  ఎథిక్స్ కమిటికి ఫిర్యాదు కూడా చేశారు.

 

జివిఎల్ నరసింహారావు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళిద్దరిపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఎథిక్స్ కమిటికి రాసిన లేఖను కూడా  మీడియాకు విడుదల  చేశారు. కేంద్రమంత్రిగా కూడా పనిచేసిన సుజనా చౌదరిపై ఈడీ ఉన్నతాధికారులు చేసిన దాడి అందరికీ తెలిసిందే. దాడుల్లో వేల కోట్ల రూపాయలను బ్యాంకుల నుండి రుణాలుగా తీసుకుని ఎగొట్టిన వైనం బయటపడింది. వివిధ బ్యాంకుల నుండి సుమారు రూ 9500 కోట్ల అప్పులు తీసుకుని విదేశాలకు తరలించేసినట్లు ఈడికి ఆధారాలు దొరికాయి.

 

సుజనా కార్యాలయాలపై జరిపిన దాడుల్లో షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారనేందుకు తగ్గ ఆరోపణలు కూడా దొరికాయట. షెల్ కంపెనీలకు సంబంధించిన 126 రబ్బర్ స్టాంపులు దొరికాయి. అలాగే, పన్నులు ఎగ్గొట్టే వారికి స్వర్గదామంగా ప్రచారంలో ఉన్న తొమ్మిది దేశాల్లో 40 షెల్ కంపెనీలున్నట్లు జగన్ మీడియా కూడా బయటపెట్టింది. తనకు నమ్మకస్తులను పై దేశాలకు పంపించి సుజనా ఆర్దిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఈఢి అనుమానిస్తోంది.

 

అదే విధంగా సిఎం రమేష్ కూడా వందల కోట్ల రూపాయల ఆర్దిక అక్రమాలకు పాల్పడ్డారనేందుకు ఐటి అధికారులకు ఆధారాలు దొరికినట్ల జివిఎల్ ఆరోపిస్తున్నారు. ఇద్దరు ఎంపిలు చంద్రబాబుకు బినామీలే అంటున్నారు జివిఎల్. వేల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న వారిపై చర్యలు తీసుకోకూడదని చంద్రబాబు డిమాండ్ చేయటం విచిత్రంగా ఉందన్నారు. ఇద్దరు ఎంపిలపై వెంటనే అనర్హత వేటు వేయాలని జివిఎల్ ఎథిక్స్ కమిటికి లేఖ రాయటం తాజా సంచలనంగా మారింది.