వ‌ధు‌వుకు క‌రోనా.. పీపీఈ కిట్‌లు ధ‌రించి పెళ్లి జ‌రిపించిన పూజారులు

పెళ్లంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు, పోటెత్తే బంధుగణం, రుచిక‌ర‌మైన వంట‌లు, సినిమా సెట్స్‌ని త‌ల‌ద‌న్నేలా లైటింగ్స్, బారాత్‌ల‌తో పెళ్లి హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇదంత క‌రోనా ముందు వ‌ర‌కు . ఇప్పుడు పెళ్లి జరిగితే కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌ర‌వుతున్నారు. స్టార్ హీరోలు రానా, నితిన్, నిఖిల్‌, కాజ‌ల్ వంటి వారు కూడా క‌రోనా వ‌ల‌న కొద్ది మంది స‌భ్యుల మధ్య పెళ్ళి పీట‌లెక్కారు. ఇప్పుడు ఎంత గ్రాండ్‌గా పెళ్లి చేసామ‌న్న‌ది కాదు పాయింట్. ఎవ‌రు క‌రోనా బారిన ప‌డ‌కుండా పెళ్లి తంతు ముగించామా అన్న‌ది లెక్క‌.

క‌రోనా అనేది ఇప్పుడు కామ‌న్ అయిపోయింది. సామాన్యుల నుండి సెల‌బ్రిటీల వ‌ర‌కు దాదాపు ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా బారిన ప‌డుతున్నారు. అయితే క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికి కొంద‌రు మాత్రం త‌మ పెళ్లి ముహూర్తం టైంకే ఏడ‌డుగులు వేస్తున్నారు. ఆ మ‌ధ్య ఓ జంట పెట్టుకున్న ముహూర్తానికే పెళ్లి చేసుకున్నారు. వ‌ధువుకి క‌రోనా రాగా, ఆమె రెండో అంత‌స్తులో క్వారంటైన్‌లో ఉంది. వ‌రుడు కింద ఉండి ఇద్ద‌రు ఓ తాడుతో త‌మ బంధాన్ని పెన‌వేసుకున్నారు. అంటే ప‌లు జాగ్ర‌త్త‌ల న‌డుమ పెట్టుకున్న ముహూర్తానికే పెళ్లి పీట‌లెక్కాల‌ని వారు భావిస్తున్నారు.

తాజాగా రాజస్థాన్‌ షాబాద్‌ జిల్లాలోని యువతీ యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. పెళ్ళి రోజు వ‌ధువుకి క‌రోనా అని తేల‌డంతో ఏం చేయాలో వారికి పాలుపోలేదు. అన్ని ఏర్పాట్లు చేసుకున్న త‌ర్వాత ఇలా క‌రోనా అని నిర్ధ‌రాణ కావ‌డంతో వధూవరులతో పాటు కుటుంబ సభ్యులు, పురోహితులు, పీపీఈ కిట్లను ధరించి కోవిడ్ సెంట‌ర్‌లో వేడుకను నిర్వహించారు. పూజారుల సూచ‌న‌లు పాటిస్తూ వ‌ధూవ‌రులు ఇద్ద‌రు పెళ్ళి చేసుకున్నారు. ఇది చూసిన వారు క‌రోనా వారిన పెళ్లిని ఆప‌లేక‌పోయింద‌ని కామెంట్స్ పెడుతున్నారు.