Shocking: ప్రేమికుల రహస్య కాపురం..! ఫ్యామిలీకి తెలీకుండా 11 ఏళ్లు అదే ఇంట్లో..

Shocking: ‘ప్రేమ ఎప్పుడు, ఎందుకు, ఎలా పుడుతుందో చెప్పలేం’, ‘ఒకరిని ఎందుకు ప్రేమిస్తున్నాం అనేదానికి కారణాలు ఉండవు’, ‘ప్రేమ గుడ్డిది’, ‘ప్రేమను విడదీసే శక్తి ఎవరికీ లేదు’.. ఇలాంటి సినిమా డైలాగుల్ని నిజం చేసిందో ప్రేమజంట. వీరు చేసింది దేశవ్యప్తంగా వార్తల్లో నిలిచింది. ఇలా ఎలా చేశారు అనే ప్రశ్న, ఆశ్చర్యం.. అంతకుమించి నిశ్శబ్ద వాతావరణమే సృష్టించారు. ప్రియుడి కోసం ఇంటి వచ్చేసిన ప్రియురాలు.. ప్రియుడు ఉంటున్న చిన్న ఇంట్లోనే ఓ గదిలో ఏకంగా పదకొండేళ్లు ఉండిపోయింది. ఆమె గదిలో ఉంటున్నట్టు ప్రపంచానికే కాదు.. ఆ ఇంట్లోనే ఉంటున్న యువకుడి తల్లిదండ్రులు, సోదరికి తెలీకపోవడం అమితాశ్చర్యం కలిగిస్తోంది. వివరాల్లోకి వెళ్తే..

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలోని అయిలూర్ గ్రామానికి చెందిన రెహమాన్ (24), సమీపంలో నివసించే సాజిత ప్రేమించుకున్నారు. ఇంట్లో వీరి ప్రేమ ఒప్పుకోరని.. ఆ యువతి ప్రియుడి వద్దకు వచ్చేసి నీతోనే ఉంటానంటూ రెహమాన్ ఉంటున్న ఇంట్లోనే అతని గదిలో ఉండిపోయింది. ఇది జరిగింది 2010లో. అప్పటినుంచి ఇప్పటికీ ఆమె ప్రపంచం ఆ చిన్నగదే. ఆ గదిలోకి కుటుంబసభ్యులు ఎవరూ వెళ్లొద్దని చెప్పి తలుపుకు ప్రత్యేక గడియ పెట్టాడు. రెహమాన్ ఎలక్ట్రీషియన్. సంపాదించే కొడుకు ఆర్డర్ కాబట్టి ఎవరూ ఇన్నేళ్లలో ఆ గదిలోకి వెళ్లలేదు.

సాజితకు రెహమాన్ ఆహారం తీసుకెళ్లేవాడు. ఆమె కాలకృత్యాలన్నీ రాత్రి వేళల్లోనే. అందరూ నిద్రించాక.. బయట బాత్ రూమ్ కి వెళ్లేది. కాసేపు వాకింగ్ చేసేది. ఇందుకు ఆ గదికి ఉన్న కిటికీని చెక్కతో ఏర్పాటు చేశాడు. ఈ పదేళ్లలో ఈ విషయాన్ని ఇంట్లోవారు, మరెవరూ పసిగట్టలేకపోయేవారు. ఆమెకోసం టీవీ ఏర్పాటు చేసి హెడ్ ఫోన్లు ఇచ్చాడు. అదే ఆమె ప్రపంచం. ఇంట్లో అందరూ బయటకు వెళ్తే మాత్రం గది బయటకు వచ్చేది. ఇంట్లో ఏమైనా వండినా.. గదిలోకి వెళ్లి చెరి సగం తినేవారు. ఇన్నేళ్లలో జరిగింది ఇదే.

సాజిత కనిపించడం లేదని 2010లోనే ఆమె తల్లిదండ్రులు పోలిస్ కేసు పెట్టారు. ఇన్నేళ్లలో ఆమె ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఇప్పుడు కూడా కరోనా పరిస్థితులతో సంపాదన ఆగిపోవడంతో వెలుగులోకి వచ్చింది. సంపాదన లేక అక్కడ ఉండటం కష్టమని.. వితనస్సరీ అనే గ్రామంలో కాపురం పెట్టారు. దీంతో రెహమాన్ కనిపించడం లేదని రహమాన్ సోదరుడు కేసు పెట్టాడు. ఈక్రమంలో నెన్మారా అనే గ్రామంలో రెహమాన్ ను చూసిన సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వీరి ప్రేమకథ వెలుగులోకి వచ్చింది. విచారణలో ఒక్కో విషయం చెప్తూంటే ఎవరికీ నోట మాట రాలేదు.

‘ఇన్నేళ్లు నాకే కష్టం రాకుండా బాగా చూసుకున్నాడు. తలొనొప్పి తప్పితే నాకెప్పుడూ సుస్తీ చేసింది లేదు. మా ఇంట్లో మా పెళ్లికి ఒప్పుకోరనే ఇలా చేశాను’ అని సాజిత చెప్పింది. ‘నా సంపాదన మీదే కుటుంబం ఆధారపడింది. కరోనా టైమ్ లో ఆదాయానికి కష్టమైంది. చేసేది లేక వేరు కాపురం పెట్టాం. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు’ అని రెహమాన్ అంటున్నాడు. పోలీసులు కూడా ఈ రెండు మిస్సింగ్ కేసులను కొట్టేశారు. ఇంతాచేస్తే వీరిద్దరి ఇళ్లకు దూరం కేవలం అరకిలోమీటర్ మాత్రమే. ఇంత గుట్టుగా సాజితను ఎలా దాచాడన్నదే అందరి మదిని తొలిచేస్తున్న ప్రశ్న. ఇదంతా చూస్తే ఒక్కడు సినిమాలో భూమికను మహేశ్ బాబు ఇంట్లో దాచిన సన్నివేశం గుర్తురాక మానదు.