బీటెక్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే తీపికబురు.. లక్షన్నరకు పైగా వేతనంతో ఉద్యోగాలు?

పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఇంజనీర్ ట్రైనీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. www.powergrid.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 10వ తేదీ చివరి తేదీగా ఉండనుంది. మొత్తం 184 ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

ఇంజనీరింగ్ ట్రైనీ(ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలు 144 ఉండగా ఇంజనీరింగ్ ట్రైనీ(సివిల్) ఉద్యోగ ఖాళీలు 28 ఉన్నాయి. ఇంజనీరింగ్ ట్రైనీ(ఎలక్ట్రానిక్స్) ఉద్యోగ ఖాళీలు 6 ఉండగా ఇంజనీరింగ్ ట్రైనీ(కంప్యూటర్ సైన్స్) ఉద్యోగ ఖాళీలు సైతం మరో 6 ఉన్నాయి. 28 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. 1995 నవంబర్ 10 న లేదా ఆ తరువాత జన్మించిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్, టెక్నాలజీ, సైన్స్(ఇంజనీరింగ్)లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 60 శాతం స్కోర్ చేసిన వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2023 స్కోర్, బిహేవియరల్ అసెస్‌మెంట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కుల ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు భారీగానే వేతనం లభించనుండగా అర్హత ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. మెడికల్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా 500 రూపాయలు చెల్లించాల్సి ఉండగా మిగతా అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు ఫీజు లేదు.