Skin Care: ఎండలో చర్మం పాడవుతోందా..? ‘నిమ్మ’తో ఇలా చేస్తే సరి..!!

Skin Care: ఎండల్లో తిరిగితే కందిపోతాం.. చర్మం ఎర్రగా అయినా.. నల్లగా అయిపోయినా బాధ పడతాం. చర్మం ఎప్పుడూ మృదువుగానే ఉండాలని కాకపోయినా ఏమాత్రం కలర్ తగ్గినా మనసు చివుక్కుమంటుంది. అసలే వేసవి కావడంతో ఎండల్లో తిరిగితే చర్మం ఖచ్చితంగా దెబ్బ తింటుంది. ఇటువంటి సమయంలో కొన్ని లోషన్లు లేదా వివిధ పద్ధతులు ఉపయోగించి చర్మం మళ్లీ మెరిసేలా చేస్తాం. అయితే.. సింపుల్ గా విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ ఉపయోగించి చర్మాన్ని కాపాడుకోవచ్చని అంటున్నారు నిపుణులు.

వేసవి  వేడి ప్రభావానికి చర్మం దెబ్బ తినడం సాధారణ విషయం. పైగా ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఎండకే చర్మం రంగు మారిపోతుంది. ఇటువంటి సమయాల్లో చర్మాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. మన శరీరానికీ, చర్మానికి నిమ్మ ఎంతో మంచిది. నిమ్మను పలు రకాలుగా.. ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం శరీరాన్నికాపాడుకోవచ్చు. ముఖ్యంగా నిమ్మ, ఎప్సమ్ సాల్ట్ కలిసి చనిపోయిన చర్మ కణాలను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. ఎప్సమ్ ఉప్పులో ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఉంటాయి. నిమ్మకాయలో చెడు బ్యాక్టరియాను తొలగించే గుణం ఉంటుంది. 

ఒక టీస్పూన్ నిమ్మరసంలో కొద్దిగా ఎప్సమ్ ఉప్పు వేయాలి. దానిని చర్మంపై స్క్రబ్ చేస్తే చాలు.. కందిన, రంగు మారిన చర్మం ప్లేస్ లో మీ పూర్వపు చర్మం కనిపించేలా చేస్తుంది. నిమ్మ-తేనె పొడి చర్మంపై అద్భుతంగా పని చేస్తుంది. ఒక టీస్పూన్ తేనెలో నిమ్మరసం వేసి ముఖం, మెడపై రాసి.. ఇరవై నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చర్మంలో తేడాను గమనిస్తారు. నిమ్మకాయ-బేకింగ్ సోడా మిశ్రమం చర్మంపై మచ్చలను శుభ్రపరచగలదు. చనిపోయిన చర్మ కణాలను తొలగించి మృదువుగా ఉంచుతుంది.

నిమ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడాను కలిపి మోచేతులు, మోకాలు, మెడ, చంకలు.. తదితర ప్రదేశాల్లో మచ్చలుంటే రాయండి. 15-20 నిమిషాల తర్వాత నీటితో కడిగితే ఫలితం కనిపిస్తుంది. కాఫీ పౌడర్‌లో యాంటీఆక్సిడెంట్, ఎక్స్‌ఫోలియేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి నిమ్మను జోడించి ముఖంపై అప్లై చేయాలి. అనంతరం సాఫ్ట్ గా మసాజ్ చేసి ముఖం కడుక్కుంటే చనిపోయిన చర్మ కణాలను తొలగించి మునుపటి చర్మాన్నిస్తుంది.

 

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో నిపుణులు, వైద్యులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వైద్యులను, నిపుణులను సంప్రదించడమే ఉత్తమం. మీ ఆరోగ్యానికి సంబంధించి ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.