రక్త ప్రసరణ వ్యవస్థ లోపిస్తే తలెత్తే అనారోగ్య సమస్యలు..? రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపరిచే మార్గాలు!

మన శరీరంలో అన్ని అవయవాల పనితీరు మెరుగ్గా ఉండాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయగలగాలి. అలా కాకుండా రక్తప్రసరణ వ్యవస్థలో అడ్డంకులు లోపాలు తలెత్తితే నిత్య జీవక్రియల్లో వ్యత్యాసం ఏర్పడి తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా రక్త ప్రసరణ నియంత్రణ కోల్పోయి ధమనులు, సిరల కండరాల వ్యాకోచంలో సమస్యలు తలెత్తి గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది. మెదడు పనితీరు దెబ్బతింటుంది.కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, కాళ్లు చేతులు తిమ్మిర్లు , డిహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలంటే రోజువారి ఆహారంలో ఇప్పుడు చెప్పబోయే పండ్లు కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు అవేంటో ఇప్పుడు చూద్దాం. సిట్రస్ జాతి ఫలాలైన నిమ్మ, నారింజ, బత్తాయి, పైనాపిల్, కివి వంటి పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా లభిస్తాయి కావున వీటిని ఆహారంగా తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేన్ తగ్గి రక్త ప్రసరణ సక్రమంగా జరగడమే కాకుండా గుండె కండరాలను బలోపేతం చేయడంలో సహాయపడుతాయి. ప్రతిరోజు దానిమ్మ రసాన్ని సేవిస్తే ఇందులో ఉండే పొటాషియం యాంటీ ఆక్సిడెంట్ రక్తనాళాలను శుభ్రం చేసి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

రక్త ప్రసరణ వ్యవస్థలో లోపాలు సవరించడానికి ప్రతిరోజు టమోటా జ్యూస్ ను సేవిస్తే ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, లైకోపిన్ అనే ఎంజైమ్ రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే సముద్ర చేపలు, బీన్స్, వాల్ నట్స్ వంటివి ఎక్కువగా తింటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.బీట్రూట్లో ఐరన్, మెగ్నీషియం, నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాకుండా శరీరంలో నైట్రస్ ఆక్సైడ్స్ గా మారి రక్త ప్రసరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది.