పచ్చళ్లు తినడంతో ఆరోగ్యం కూడా..! ఎలాగంటారా..?

భోజనంలో కూర, పప్పు, చారు, పెరుగు.. ఎలా ముఖ్యమైనవో పచ్చళ్లూ అంతే. పచ్చళ్లతో మనకు ఎమోషనల్ టచ్ ఉంటుంది. పచ్చడితోనే మనం అన్నం తినడం ప్రారంభిస్తాం. పచ్చళ్లను మన ఇళ్లలో ఎన్నో రకాలుగా తయారు చేస్తారు. ముఖ్యంగా ఆవకాయ. వేసవి వచ్చందంటే కొత్త ఆవకాయ కోసం ఎదురుచూడని వారు ఉండరు. ఊరగాయ, మాగాయ, టమాటా, దోసకాయ, గోంగూర, మిరపకాయ, కొబ్బరి.. ఇలా ఎన్నో రకాల పచ్చళ్లు చేస్తారు. కొన్నేళ్లుగా చికెన్, మటన్, రొయ్యి పచ్చళ్లు కూడా వచ్చాయి. ఇన్ని రకాల పచ్చళ్లు ఉన్నాయి.. తింటే ఆరోగ్యమేనా అంటే చాలా మంచిదంటున్నారు ఆహార నిపుణులు వైద్యులు.

పచ్చళ్లు తినేవారిలో, తినని వారిలో ఆరోగ్యంలో కొన్ని మార్పులు ఉంటాయి. పచ్చళ్ల తయారీలో నూనె, వెనిగర్ కలుపుతారు. వీటివల్ల లాక్టిక్, సిట్రిక్, ఎసిటిక్ యాసిడ్లు కలిసి శరీరానికి మేలు చేస్తాయి. మనల్ని యాక్టివ్ గా ఉంచడంలో సాయపడతాయి. మన పొట్టలో ఇవి మైక్రోబ్స్‌లాగా పనిచేసి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరంలో అన్ని అవయవాలూ సక్రమంగా పని చేసేలా చేస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను కంట్రోల్‌లో ఉంచుతాయి కూడా. పచ్చళ్లలో కలిపే నూనె లేదా వెనిగర్, ఉప్పు, కారం.. కూడా కలపడంతో యాంటీఆక్సిడెంట్స్, మైక్రోన్యూట్రియంట్స్ కలిసి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.

అయితే.. పచ్చళ్లు మరీ ఎక్కువ తినకూడదని కూడా చెప్తున్నాయి మరికొన్ని పరిశోధనలు. వీటిలో క్యాలరీలు ఎక్కువగా ఉండవని, శరీరానికి ఎనర్జీ సరిపోదని, త్వరగా ఆహారం అరిగేలా చేస్తాయని అంటారు. పచ్చడితో ఎక్కువగా తింటే వెంటనే మళ్లీ ఆకలి వేసి స్నాక్స్ వంటి ఇతర ఆహార పదార్థాలు తినేలా చేస్తాయని అంటున్నారు. స్నాక్స్ తినడానికి రుచిగా ఉన్నా పోషకాలు ఉండవు. ఇవి బాడీలో ప్రోటీన్స్‌ను, కార్బోహైడ్రేట్స్‌నూ పెంచి బరువు పెరగడం, స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నాయి. మార్కెట్లలో తయారు చేసే పచ్చళ్లు కంటే ఇళ్లలో తయారుచేసిన పచ్చళ్లే మంచిదంటున్నారు డాక్టర్లు. బయట పచ్చళ్లు నిల్వ ఎక్కువగా ఉండాలని ఉప్పు, నూనె ఎక్కువగా వేస్తారు.

గమనిక: ఈ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. పలు సందర్భాల్లో ఆహార నిపుణులు అందించిన వివరాలనే ఇక్కడ ఇచ్చాం. అర్హత ఉన్న నిపుణుల అభిప్రాయాలకు పై వివరాలు ప్రత్యామ్నాయం కాదు. మీ ఆరోగ్యం విషయంలో ఎటువంటి సమస్య ఉన్నా, సలహాలకైనా వెంటనే వైద్యులను, ఆహార నిపుణులను సంప్రదించడమే ఉత్తం. మీ ఆరోగ్యానికి సంబంధించి పై కథనం విషయంలో ‘తెలుగు రాజ్యం’ ఎటువంటి బాధ్యత వహించదు. గమనించగలరు.