నెయ్యితో అందమైన మెరిసే కాంతివంతమైన చర్మం మీ సొంతం..

ప్రతిరోజు నెయ్యిని ఆహారంలో భాగంగా ఉపయోగిస్తే అద్భుతమైన రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు అనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు చెప్పబోయే అంశాల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోకమానరు. నెయ్యిలో మన ఆరోగ్యాన్ని కాపాడే పోషకాలతో పాటు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని బ్యూటీషియన్ నిపుణులు చెబుతున్నారు. వంటింటి చిట్కాలతో నెయ్యిని ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా నెయ్యిలో మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే విటమిన్ ఏ, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉన్నందున చర్మానికి సహజ అందాన్ని ఇవ్వడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. దానికి తోడు నెయ్యిలో ఒక స్పూన్ పసుపు కలిపి మెత్తటి మిశ్రమంగా మార్చుకున్న తర్వాత ముఖానికి అప్లై చేయాలి. తరువాత సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు అలానే ఉంచి ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే పసుపులో ఉండే యాంటీ మైక్రోబియన్ గుణాలు చర్మంపై హానికర బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించి చర్మంపై ఉండే నల్లని వలయాలను, మొటిమలను తగ్గించడంలో తోడ్పడుతుంది.

అలాగే రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి , ఒక టేబుల్ స్పూన్ శెనగపిండి ,చిటికెడు పసుపు, కొన్ని చుక్కల నిమ్మరసం తీసుకుని వీటిని అన్నింటిని బాగా మిక్స్‌ చేసి ఫేస్ ప్యాక్ లా చేసుకున్న తర్వాత 15 నిమిషాలు పాటు ఉంచి శుభ్రం చేయాలి.ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖంపై మడతలు తగ్గి వృద్ధాప్య ఛాయలు తొలగిపోతాయి. చర్మ సౌందర్యాన్ని పెంపొందించడం లో కుంకుమపువ్వు ఎంతగానో తోడ్పడుతుంది దీనికి తోడు బ్యూటీ విటమిన్స్ సమృద్ధిగా ఉన్న నెయ్యిలో కొన్ని కుంకుమపువ్వు రేకులను మిక్స్ చేసి చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుంటే చర్మ సమస్యలన్నీ తొలగిపోయి అందమైన కాంతివంతమైన మెరిసే చర్మం మీ సొంతమైనట్లే.