పండ‌గ‌ల వేళ మెరిసిపోండిలా…

చర్మసంరక్షణ

ఏ అమ్మాయిక‌యినా ఫంక్ష‌న్ వ‌చ్చినా పండ‌గ వ‌చ్చినా అంద‌రికంటే నేనే ఎక్కువ అందంగా క‌నిపించాలి అని అనుకుంట‌ది. అంద‌రిలో ఎట్రాక్టివ్‌గా కనిపించాల‌నుకుంటారు. ఇక వ‌రుస‌ పండుగల సమయం ఇలాంటి స‌మ‌యంలో మీరు మెరవాలి. అందంగా కనిపించాలి. అది సాధ్యం కావాలంటే.. ముందు చర్మసంరక్షణపై దృష్టి సారించాలి. ఆ చిట్కాలేంటో ఓ సారి చూసేద్దాం.

సహజ చర్మతత్వం కలవారు…

అర చెంచా ముల్తానీ మట్టిలో అరచెంచా పాలపొడి, గులాబీ రేకలు మిశ్రమం, దానిమ్మ రసం చెంచా చొప్పున, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పది నిమిషాలయ్యాక కాచి చల్లార్చిన పాలల్లో దూదిని ముంచి ముఖంపై అద్దినట్లు చేయాలి. మర్దన చేస్తూ పూతను తొలగించుకుంటే సరి. ముఖం ప్రకాశవంతంగా మారుతుంది.

చ‌ర్మం జిడ్డుగా ఉంటే…

సెనగపిండి, సోయాపిండి అరచెంచా చొప్పున, పావుచెంచా తులసి ఆకుల పొడి, చిటికెడు పసుపు, రెండు మూడుచెంచాల బత్తాయిరసం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల తరవాత కడిగిస్తే మార్పు ఉంటుంది. చర్మం తాజాగా మారుతుంది. ఇలా రోజుమార్చిరోజు చేయాలి.

చ‌ర్మం పొడిబారితే…

పెసరపిండి, ఓట్స్‌పొడి, పాలమీగడ, బాదంపొడి అరచెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ పాలతో కలిపి ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తరువాత తీసేయాలి. మరీ పొడిబారిన చర్మం ఉన్నవారు ఈ మిశ్రమాన్ని వేసుకునే ముందు అరటిపండును తేనెలోముంచి ముఖానికి రాసుకుని రెండు మూడు నిమిషాలు మర్దన చేయాలి. పదినిమిషాలయ్యాక కడిగేసుకుని అప్పుడు పూతవేయాలి. చర్మం చాలా మృదువుగా మారుతుంది.