మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపిస్తోందా…. పరిష్కార మార్గాలు ఇవిగో!

మూత్ర విసర్జన సమయంలో ఏర్పడే మంట, దురద వంటి లక్షణాలను అశ్రద్ధ చేయకుండా మొదట్లోనే వైద్య సలహాలు పాటించి నయం చేసుకోవడం ఉత్తమం.లేకపోతే భవిష్యత్తులో ప్రమాదకర సుఖ వ్యాధులకు దారి తీయవచ్చు. మూత్రాశయ ఇన్ఫెక్షన్ సమస్య పురుషుల కంటే మహిళలనే ఎక్కువగా వేధిస్తోందని తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
మూత్రశాల ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తడానికి గల కారణాలను పరిశీలిస్తే క్రమ పద్ధతిలేని ఆహారపు అలవాట్లు,సురక్షితం కాని లైంగిక చర్యలు, నీళ్లు తక్కువగా తాగడం,వ్యక్తిగత శుభ్రత పాటించక పోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పుకోవచ్చు.

మూత్రాశయ,కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి బయట పడాలంటే మన జీవన విధానంలో తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. మనందరి ఇండ్లలో తప్పనిసరిగా ఉండే ధనియాలు కిడ్నీ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.కావున ధనియాలను, పటిక బెల్లాన్ని ఉప్పును తీసుకొని నీటిలో బాగా మరిగించిన తర్వాత వచ్చే కషాయాన్ని చల్లార్చు కొని రోజుకు నొప్పి తీవ్రతను బట్టి రెండు లేదా మూడు సార్లు సేవిస్తే మూత్ర నాళాల్లో ఇన్ఫెక్షన్ తగ్గి మంట, నొప్పి, దురద వంటి సమస్యలు తొలగిపోతాయి.

కిడ్నీ,మూత్ర ఇన్ఫెక్షన్ సమస్యలతో బాధపడుతున్న వారు ఫాస్ట్ ఫుడ్ ,సాఫ్ట్ డ్రింక్, టీ,కాఫీలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. దీనికి బదులు ప్రతిరోజు కాన్ బెర్రీ జ్యూస్ తాగడం వల్ల ఈ పండ్లల్లో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్‌ మూత్రనాళంలో ఉన్న బ్యాక్టీరియా , వైరస్ నశింపజేసి మూత్రశయ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది. కొత్తిమీరను ఆహారంలో తీసుకోవడంతో పాటు ప్రతిరోజు కొత్తిమీర జ్యూస్ ను సేవిస్తే ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు మూత్రాశయ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కల్పిస్తుంది

ముఖ్యంగా మూత్రశయ ఇన్ఫెక్షన్ గర్భిణీ స్త్రీలను ఎక్కువగా బాధిస్తుంది. కావున ప్రతిరోజు తగినంత నీటిని తీసుకోవడంతో పాటు ధనియాల కషాయాన్ని సేవించాలని మన పెద్దలు చెబుతున్నారు. మరికొందరిలో మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం వల్ల కూడా మూత్రాశయలో ఇన్ఫెక్షన్ వచ్చి మంటగా ఉంటుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ఒత్తిడి అధికమై మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది. కావున ఎక్కువ రోజులు మూత్ర ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతుంటే తప్పనిసరిగా వైద్య సలహాలు తీసుకోవాలి.