సుగంధ ద్రవ్యాల్లో ఒకటైన యాలకులను రోజువారి ఆహారంలో ఉపయోగించవచ్చా..?

మసాలా దినుసుల్లో రాణిగా పిలవబడే యాలకుల్లో అద్భుతమైన రుచి, వాసనతో పాటు ఎన్నో ఔషధ గుణాలు నిండుగా ఉన్నాయి.సుగంధ ద్రవ్యాల్లో ప్రముఖమైన యాలకులను ఆహారంలో రుచి, సువాసన కోసం మాత్రమే ఉపయోగిస్తారని చాలామంది పొరబడుతుంటారు.యాలకులను రోజువారి ఆహారంలో ఉపయోగిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను సహజ పద్ధతిలో పొందవచ్చు.
యాలకులను ఆయుర్వేద వైద్యంలో ఎన్నో మొండి వ్యాధులను నయం చేయడానికి కొన్ని వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.

యాలకుల్లో సమృద్ధిగా విటమిన్స్, ప్రోటీన్స్ , ఫైబర్ ఐరన్, మాంగనీస్, కాల్షియం, రైబోఫ్లావిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాలతో పాటు మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియన్ గుణాలు, యాంటీ క్యాన్సర్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా లాభ్యమవుతాయి. తాజా అధ్యయనాల ప్రకారం మన శరీరంలో క్యాన్సర్ కణాలను నియంత్రించే ఎంజైముల ఉత్పత్తిని పెంచడానికి యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిసింది.

యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ , యాంటీ సెప్టిక్ లక్షణాలు మన శరీరంలో వ్యాధి కారకాలను తొలగించడంతోపాటు కడుపులో పుండ్లు, అల్సర్లు, చర్మ క్యాన్సర్, ఉదర క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యతో బాధపడేవారు యాలకులను నమిలితే ఇందులో ఉండే యాంటీబయోటిన్ గుణాలు వ్యాధికారక బ్యాక్టీరియాలను నశింపజేసి దంతక్షయాన్ని చిగుళ్ల సమస్యను అరికడుతుంది.

గుండెపోటు రక్తపోటు సమస్యలతో బాధపడేవారు తరచు యాలకులను ఆహారంలో వినియోగిస్తే ఇందులో ఉండే పొటాషియం ,మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్, ఫైబర్ వంటి పోషకాలు గుండె ధమనులను, రక్తనాళాలను శుభ్రం చేసి రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. ఫలితంగా గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల తలెత్తే డయేరియా, వాంతులు, విరోచనాల సమస్య నుంచి తక్షణ ఉపశమనం పొందాలంటే యాలకుల కషాయాన్ని సేవిస్తే సరిపోతుంది.