Drug Smuggling: తెనాలిలో డ్రగ్స్ కలకలం: బెంగళూరు నుంచి పార్శిల్‌.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!

Drug Smuggling: గుంటూరు జిల్లా తెనాలిలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టయింది. బెంగళూరు నుంచి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ తెప్పించుకుంటున్న ముగ్గురు యువకులను పోలీసులు వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీ విలువున్న MDMA డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి తెనాలికి డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఈగల్ టీమ్, స్థానిక పోలీసులు మంగళవారం రాత్రి సుల్తానాబాద్ ప్రాంతంలో మాటు వేశారు. ఓ ప్రైవేట్ బస్సులో వచ్చిన పార్శిల్‌ను ముగ్గురు యువకులు అందుకుంటుండగా పోలీసులు మెరుపుదాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో పట్టుబడిన నిందితులు విద్యావంతులు కావటం గమనార్హం. సంతోష్ కుమార్ మారీసుపేట నివాసి. బెంగళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి, ప్రస్తుతం నందివెలుగులో హోటల్ నిర్వహిస్తున్నాడు. అజయ్ కుమార్ తెనాలి ప్రభుత్వ ఆస్పత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి. దత్తసాయి మహంత్ కొత్తపేటకు చెందిన బీటెక్ విద్యార్థి.

పోలీసుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. సంతోష్ కుమార్ తన పాత పరిచయాలతో బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తికి రూ.14,000 ఆన్‌లైన్ (PhonePe) ద్వారా పంపాడు. బస్సు డ్రైవర్‌కు అనుమానం రాకుండా ఉండేందుకు డ్రగ్స్‌ను ఒక చిన్న ఇనుప వస్తువు లోపల కవర్‌లో పెట్టి ప్యాక్ చేశారు. పోలీసులు వారి నుంచి 5 గ్రాముల ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

తాము కేవలం సొంత అవసరాల కోసమే డ్రగ్స్ తెప్పించుకున్నామని నిందితులు ప్రాథమికంగా వాంగ్మూలం ఇచ్చారు. అయితే, గతంలో కూడా వీరు ఇలాగే డ్రగ్స్ తెప్పించుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

“డ్రగ్స్ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదు. నిందితుల మొబైల్ డేటాను విశ్లేషిస్తున్నాం. వీరి వెనుక ఉన్న నెట్‌వర్క్, బెంగళూరులో డ్రగ్స్ సరఫరా చేసిన వ్యక్తి వివరాలను సేకరిస్తున్నాం.” అని  తెనాలి డీఎస్పీ బి.జనార్దనరావు గారు అన్నారు.

ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విద్యావంతులైన యువకులు ఇలా డ్రగ్స్ ఊబిలో కూరుకుపోవడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది.

Mangli Controversy: What Exactly Happened | Telugu Rajyam