ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజనతో, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా పోయిన మాట వాస్తవం. కట్టుబట్టలతో హైద్రాబాద్ నుంచి, కొత్త రాష్ట్రానికి తరలి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిన మాట కూడా నిజమే. కానీ, ఎవరికి.? సామాన్యులకి కాదే.! అధికార యంత్రాంగం ఆంధ్రప్రదేశ్కి పరుగులు పెట్టాల్సి వచ్చింది.. ప్రజా ప్రతినిథులూ, సొంత రాష్ట్రానికి వెళ్ళక తప్పలేదు. అయితే, పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్ని ఉపయోగించుకోవచ్చని తెలిసీ, కేవలం ఓటుకు నోటు కేసు నేపథ్యంలోనే చంద్రబాబు, అమరావతికి పరుగులు పెట్టారన్నది జగమెరిగిన సత్యం. సరే, కారణాలేవైతేనేం.. ‘మన రాష్ట్రం – మన ఆత్మగౌరవం’ అనే నినాదంతో, ప్రజలూ సర్దుకుపోయారు. కానీ, ఓ రాష్ట్ర రాజధానిని నిర్మించేందుకు, ఓ ప్రభుత్వానికి ఐదేళ్ళ సమయం సరిపోలేదంటే, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.?
అన్నీ తాత్కాలికమే.. అదే అతి పెద్ద సమస్య
నిజానికి, ‘తాత్కాలికం’ పేరుతో కట్టినవేవీ, తాత్కాలిక నిర్మాణాలు కావు. కానీ, ‘తాత్కాలికం’ అనే పేరు పెట్టి, చంద్రబాబు తన పతనానికి తానే నాంది పలికారు. ప్రస్తుత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు.. ఇవేవీ తాత్కాలిక భవనాలు కావు. అన్నీ గట్టి నిర్మాణాలే. ఎప్పుడైతే చంద్రబాబు వాటికి ‘తాత్కాలికం’ అని పేరు పెట్టారో, అక్కడే అమరావతి సగం చచ్చిపోయింది. ఆ తర్వాత, సవాలక్ష కారణాలతో, పబ్లిసిటీ స్టంట్లు చేసి.. శాశ్వత నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయలేక.. అమరావతిని పూర్తిగా దెబ్బతీసేశారు. కొన ఊపిరితో వున్న అమరావతి, వైఎస్ జగన్ హయాంలో ఆ తుది ముచ్చట కూడా చూసేసింది.
లక్ష కోట్లు.. ఎవడబ్బ సొమ్మనీ.!
రాజధాని అమరావతి అనేది ఓ నగరం కాదు, ఓ ప్రాజెక్టుగా వార్తల్లోకెక్కింది. ఆ ప్రాజెక్టుని సింగపూర్ చేతుల్లో పెట్టారు. అంతకు ముందు చైనా సహా పలు దేశాల్లో తిరిగారు. చివరికి ఏం సాధించినట్లు.? సినీ దర్శకుడ్ని కూడా రంగంలోకి దించారు. ఇన్ని పబ్లిసిటీ స్టంట్లు చేశాక.. ఇంత కాలయాపన జరిగాక, ఏదో ఒకటి.. అన్నట్టు అమరావతి నిర్మాణం చేస్తే అది కుదిరే పని కాదు. ఎంత చేసినా, ఆ గ్రాఫిక్స్ ఇమేజ్ల ముందు నిలబడదు. అన్నిటికీ మించి, రాష్ట్రం అప్పుల పాలైపోయిన నేపథ్యంలో, అమరావతి అనేది రాష్ట్రానికి గుదిబండగా మారిపోతుంది.
ఇప్పుడు సోయ పెరిగింది చంద్రబాబుకి..
అధికారంలో లేకపోతే, బాధ్యతలు గుర్తుకొచ్చేస్తాయి చంద్రబాబుకి. అమరావతి కోసం ‘మై బ్రిక్ మై అమరావతి’ అన్నారు.. హుండీలు కూడా పెట్టేసి విరాళాలు వసూలు చేశారు. ఏమయ్యాయి అవన్నీ.? ఈ రోజు అమరావతి ఉద్యమానికి ఏడాది పూర్తయిన దరిమిలా.. చంద్రబాబు మరోమారు ఉత్సాహంగా హడావిడి చేసేస్తున్నారు. తన హయాంలో చిన్నదో పెద్దదో అమరావతిని చంద్రబాబు పూర్తి చేసేసి వుంటే, దాన్ని కాదని.. ప్రస్తుత ప్రభుత్వం ఇంకో ఆలోచన చేసేది కాదేమో.!