(యనమల నాగిరెడ్డి)
ఇటీవల ముగిసిన తెలంగాణా ఎన్నికల తర్వాత “చంద్రబాబుకు తాను కూడా రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని” తెరాస అధినేత, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (ముఖ్యమంత్రి కుమారుడు) ప్రకటనలు చేశారు. దీనికి ఎపి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అంతేవాసులు ఇస్తున్న సమాధానాలు ప్రస్తుతం ఎపి లో తీవ్ర చర్చనీయాంశాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఇస్తున్న విశ్లేషణ.
తెలంగాణా ఎన్నికలు – చంద్రబాబు ఎత్తులు
అర్థాంతరంగా తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు శాసన సభను రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. బీజేపీతో నాలుగున్నర సంవత్సరాలు జత కట్టి కటీఫ్ కొట్టిన చంద్రబాబు ఈ ఎన్నికలను అవకాశంగా తీసుకుని (బీజేపీ దాడి నుండి తనను తానూ కాపాడుకోవడానికి) బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్ లో తాను గతంలోనే ముందు జాగ్రత్తగా ప్రవేశ పెట్టిన రేవంత రెడ్డి (తెలంగాణా ఆటో డ్రైవర్ల ఆరోపణ), కాంగ్రెస్ పార్టీకి చెందని నాయకుడు , ఇతర ఘనాపాఠీల సహకారంతో చంద్రబాబు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేయి పట్టుకున్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుచేస్తానని దేశం అంతా చెడతిరిగారు.
తెలంగాణా మధ్యంతర ఎన్నికలు అవకాశంగా తీసుకున్న బాబు గారు “రాజకీయంగా తన పబ్బం గడుపుకోవడానికి, ఈ ఎన్నికల ద్వారా తన చాణుక్య రాజనీతిని ప్రపంచానికి చాటి, అక్కడ టీడీపీ ఉనికి కాపాడటం లక్ష్యంగా” ఆయన కాంగ్రెస్ తో జత కట్టారు. మహాకూటమిలో పేరుకు కాంగ్రెస్ పెద్దన్న కాగా, టీడీపీ చిన్న తమ్ముడైనా ఎన్నికల పెత్తనమంతా తన చేతిలోకి తీసుకున్నా చంద్రబాబు రాష్ట్ర కాంగ్రెస్ లో ఘనాపాఠీలతో పాటు, ఆ పార్టీ అగ్ర నాయకత్వాన్ని కూడా తన చిటికెన వేలుపై ఆడించారు. కాంగ్రెస్ మహామహులకు ఎన్నికల పాఠాలు చెప్పారు.
తన అంగబలం, ఆర్థిక బలం,మీడియా బలం పూరిగా వినియోగించడంతో పాటు, ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించాల్సిన ఇంటెలిజెన్స్ విభాగాన్ని కూడా తెరాస పై యుద్దానికి ప్రయోగించారు. అన్నీ చేసినా ఈ ఎన్నికలలో తెలంగాణా ప్రజలు చంద్రబాబును, ఆయనతో జతకట్టిన కాంగ్రెస్ ను మట్టి కురిపించారు. “రాజకీయాలలో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనడానికి కాంగ్రెస్- టీడీపీ పొత్తు ప్రత్యక్ష నిదర్శనమని, తమ పార్టీ వెళ్లి చంద్రబాబుతో కలవడం వల్లనే తాము ఇంత ఘోరంగా ఓడిపోయామని, అలా కాక తాము ఒంటరిగా పోటీ చేసి ఉంటె మరింత మెరుగైన ఫలితాలు వచ్చిఉండేవని ” ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల ఆవేదన.(తెలంగాణా జనం మాట కూడా అదే).
దెబ్బకు — దెబ్బే కెసిఆర్ లక్ష్యం
“తనకు బీజేపీకి అంటకట్టి, తనను ఓడించడానికి సర్వశక్తులు ఒడ్డిన చంద్రబాబుకు” ఏపీలో జరిగే ఎన్నికలలో తగిన గుణపాఠం చెప్పి, చంద్రబాబుపై దెబ్బకు దెబ్బ తీయాలని కెసిఆర్ ఉవ్వీళ్ళూరుతున్నారు. అలాగే బహిరంగంగా ప్రకటిస్తున్నారు కూడా. తెరాస గెలిచిన వెంటనే వైస్సార్ శ్రేణులు, జన సైనికులు ఏపీలో సంబరాలు జరుపుకున్నారు. “తమ చిరకాల ప్రత్యర్థి చంద్రబాబు, తమ నేతను అష్టకష్టాల పాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఒకేసారి మట్టి కరిచాయని, ఈ పరిణామాలు వచ్చే ఎన్నికలలో తమకు మేలు చేస్తాయని” ,వైస్సార్ పార్టీ శ్రేణులు పండగ చేసుకోగా, “కాపు రిజర్వేషన్ల్ పేరుతొ గత నాలుగేళ్లుగా దోబూచులాడి మోసం చేసిన చంద్రబాబుకు తెలంగాణా ప్రజలు తగిన గుణ పాఠం చెప్పారని, ఇది తమ జనసేనకు మంచి చేస్తుందని” జనసైనికులు పండగ చేశారు. అయితే ఈ పరిణామం ఎపి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది అందరి మెదళ్ళను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న.
ఎపి రాజీయాలపై కెసిఆర్ ది వ్యతిరేక ప్రభావమే!
ఎపి రాజకీయాలలో కెసిఆర్ వెనుకనుండి చక్రం తిప్పితే చంద్రబాబుకు గడ్డుకాలమే కావచ్చు. కానీ ఆయన బహిరంగంగా రంగంలో దిగితే కెసిఆర్ మద్దతు ఇచ్చే పార్టీకి మంచి కంటే చెడుపు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుందని రాజకీయ పండితులు అభిప్రాయపడుతున్నారు. కెసిఆర్ తెలంగాణా ఉద్యమం ప్రారంభమైనప్పటి నుండి కోస్తాఆంధ్ర ప్రాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణా యువతకు రావలసిన ఉద్యాగాలు,నీళ్లు, నిధులలో అగ్రభాగం కోస్తా వారే తీసుకువెళ్లారని తెలంగాణా వాదుల మొదటి ఆరోపణ. హైదరాబాదులో ఉన్న కోస్తా ప్రజలు ఎలా ఉన్నా, కోస్తా ఆంధ్రాలో మాత్రం కెసిఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది.
తాగునీళ్లకు సైతం కటకటలాడుతున్న రాయలసీమవాసులు పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణ నీళ్లు దొంగతనంగా తరలించుకు వెడుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు కూడా అదే పాత పాడుతున్నారు. సీమకు- తెలంగాణకు మధ్య రాజోలిబండ రగడ ఉండనే ఉంది.
విభజన చట్టం మేరకు అప్పటికి నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులకు రెండు రాష్టాలు అభ్యంతరం పెట్టకూడదు. అందులో భాగంగా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి ఉద్దేశించి, రాష్ట్ర విభజన సమయానికి డిపిఆర్ తయారు చేసి, సుమారు 500 కోట్లు ఖర్చు చేసిన “దమ్ముగుడెం -నాగార్జునసాగర్ టైల్ పాండ్” ప్రతిపాదనను కెసిఆర్ రంగు రూపు మార్చి అనేక పేర్లతో ఇతర ప్రాజెక్టులు చేపట్టి రాయలసీమకు అన్యాయం చేశారనే ఆవేదన సీమ వాసులలో ఉంది. (ఈ పాపంలో ఎపి ప్రభుత్వానిదే అగ్రభాగం అని చెప్పక తప్పదు. చంద్రబాబుకు ఉన్న రెండు కళ్ళలో ఒకటి అమరావతికి, మరొకటి పోలవరానికి ఇచ్చి వేశారు. ఆయనకు మూడో కన్ను లేదు కాబట్టి రాయలసీమకు అవసరమైన ఈ ప్రాజెక్ట్ ను పట్టించుకోలేదు).
ఈ కారణాల వల్ల కెసిఆర్ పై రాయలసీమ వాసులకు, ఉద్యమకారులకు తీవ్ర కోపం ఉంది. అలాగే తాగే నీళ్లకు చస్తున్న సీమ ప్రాంతానికి వ్యతిరేకంగా ట్రిబ్యునల్ లో వాదనలు వినిపించడం కూడా ఈ ప్రాంత వాసులకు రుచించడం లేదు. ఇంత వ్యతిరేకత ఉన్న సీమ ప్రాంతంలో కెసిఆర్ ఎత్తులు ఎలా పారగలవని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
కెసిఆర్ చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తే తమకు ఏంతో మేలు జరుగుతుందని, కెసిఆర్ కు చెడ్డచేయడానికి వెళ్లి తమ నాయకుడు మూటకట్టుకున్న ఫలితమే కెసిఆర్ కూడా మూటకట్టుకుంటారని సీనియర్ తెలుగు తమ్ముళ్లు చంకలు గుద్దు కుంటున్నారు. కెసిఆర్ రివర్స్ గిఫ్ట్ రూపంలో తమ నేతకు తిరిగి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టగలరని తెలుగు తమ్ముళ్లు అంచనా వేస్తున్నారు.
బాబుకు గుణపాఠం చెపుతాం–ఒవైసీ ప్రకటన
ఇకపోతే ఎంఐఎం పార్టీ అధినేత, నోటికి అడ్డు అదుపు లేని ముస్లిం నాయకుడు అసదుద్దీన్ ఓవైసి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని తొడ కొట్టి చెపుతున్నారు. ఏపీలో ముస్లింలలో అత్యధికులు వై .ఎస్. రాజశేఖర్ రెడ్డి వీరాభిమానులే. వైస్సార్ పై ఉన్న అభిమానంతో ముస్లింలు గత ఎన్నికలలో జగన్ కు మద్దతు పలికారు. వైస్సార్ పై వారికి ఇప్పటికీ అభిమానం ఉందని, చంద్రబాబు ఎన్ని ఎత్తులు వేసినా ముస్లింలు జగన్ కే మద్దతు పలుకుతారని రాజకీయ పండితుల అంచనా.
చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నా టీడీపీని వీడని ముస్లింలు ఈ దశలో ఓవైసీ వచ్చి ప్రచారం చేసిన వెంటనే బాబుకు వ్యతిరేకం గా మారుతారని ఆశించడం భ్రమే అవుతుంది. ఓవైసీ ప్రచార సరళి ఇపుడున్న విధంగా ఉంటె జగన్కు జరిగే మేలు కంటే వైస్సార్ పార్టీకి అనుకూలంగా ఉన్న హిందూ ఓట్లకు ఏంతో కొంత గండి పడుతుందని వారు అంచనా వేస్తున్నారు.
ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన ముఖ్యసహచరులు కెసిఆర్ ను, ఓవైసీ ని “రారా! రారా ! వెంటనే రారా!” అంటూ స్వాగతిస్తున్నారు.
ఏతా వాతా తేలేదేమంటే చంద్రబాబుకు తలంటి ప్రతీకారం తీర్చుకోవాలంటే కెసిఆర్, ఓవైసీ ఇరువురూ కూడా ఏపీలో ప్రచారం చేయనవసంర లేదు. ఆంధ్రలో అడుగు పెట్టకుండానే పని చేయడం మంచిది. ఇదే మంచి వ్యూహం. చంద్రబాబు ప్రత్యర్థి జగన్ కు కానీ, పవన్ కు కానీ ఆర్థికంగా సహకరించడం, ఎన్నికల ఎత్తుగడలు చెప్పడం, పోల్ మానేజ్మెంట్లో పాఠాలు నేర్పడం చేయాలని, హైదరాబాద్ లో స్థిరనివాసం ఉంటున్న బాబు గారి అస్మదీయుల ద్వారానే ఆయనకు ఎన్నికల పాఠం చెప్పడం చేయాలి.
వచ్చే ఆరు నెలల కాలంలో తెలంగాణా అవసరాలుతీరిన తర్వాతైనా కెసిఆర్ రాయలసీమ నీటి అవసరాలపై అనుకూల వైఖరి తీసుకోవడం, ఏపీని దాయాదిగా కాకుండా పొరుగు రాష్ట్రంగా చూడటం లాంటి చర్యలు చేపట్టడం ద్వారా ఇక్కడి ప్రజల మనసులలో చోటు సంపాదించిన తర్వాతనే కెసిఆర్ ఇక్కడి రాజకీయాలలో వేలు పెడితే అనుకూల ఫలితం ఉంటుంది. లేకపోతె ఆయనకు, ఆయన మద్దతు ఇచ్చే పార్టీకి బూమరాంగ్ అవుతుందని చెప్పక తప్పదు.
