ఆంధ్రపదేశ్లో దేవాలయాలపై దాడులకు సంబంధించి తీవ్ర స్థాయిలో పెను దుమారం రేపుతున్న విషయం విదితమే. అంతర్వేది రధం దగ్ధం, రామతీర్థం పుణ్యక్షేత్రంలో రాములోరి విగ్రహం తల భాగాన్ని తొలగించడం.. ఇవన్నీ చాలా చాలా పెద్ద విషయాలే. ఆయా ఘటనలకు సంబంధించి పోలీసులు లోలైన విచారణ జరుపుతున్నారు. ఈ తరహా ఘటనలకు సంబంధించి కొందర్ని అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీస్ ప్రకటించిన విషయం విదితమే. అయితే, దేవాలయాలపై దాడులకు సంబంధించి దుష్ప్రచారాన్ని సైతం తీవ్రంగా పరిగణించాల్సిందే. రాజకీయ పార్టీలు, రాజకీయమే చేస్తాయి.. అది ఆయా రాజకీయ పార్టీలకు జన్మ హక్కు అనుకోవాలేమో. కానీ, సున్నితమైన విషయాలకు సంబంధించి రాజకీయం హద్దులు దాటితే, అది శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. ఎక్కడో ఏదో జరిగిపోయిందన్న వదంతులు, సమాజంలో అలజడి సృష్టిస్తాయి. ఈ విషయంలో రాజకీయ పార్టీలు సంయమనం పాటించాల్సిందే.
రాజకీయ పార్టీల సంయమనమే ప్రజలకు శ్రీరామరక్ష. కానీ, ప్రస్తుత రాజకీయాల్లో రాజకీయ పార్టీలు సంయమనం పాటించడం అనేది జరగని పని. బాధ్యతారాహిత్యమే ఇందుకు ప్రధాన కారణం. విపక్షాల రాజకీయం సంగతి పక్కన పెడితే, అధికార పార్టీ నేతల రాజకీయం కూడా వెర్రి తలలు వేస్తోంది. ఆయా ఘటనలకు సంబంధించి అధికార పార్టీ నేతలు కొందరు తీర్పులిచ్చేస్తున్నారు. రాత్రిళ్ళు టార్చిలైటు వేసుకుని, ప్రతిపక్ష నేత ఏ గుడిని కూల్చాలి.? అని వెతుకుతున్నారంటూ అధికార పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని సీరియస్గానే పరిగణించాలి. అదే సమయంలో, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్నీ తీవ్రంగానే భావించాలి. కేసులు పెట్టాం, అరెస్టులు చేశాం.. అని ప్రభుత్వం చెబితే సరిపోదు, జవాబుదారీతనం వుండాలి.. బాధ్యతగా మెలగాలి కూడా. అన్నిటికీ మించి, ప్రజలకు భరోసా ఇచ్చేలా.. దుష్పచారంపైనా ఉక్కుపాదం మోపాల్సి వుంటుంది.