Supreme Court: ఎంతకాలం ఈ ఉచిత పథకాలు.. సుప్రీంకోర్టు ఫైర్!

ఉచిత పథకాలు దేశ అభివృద్ధికి ఆటంకంగా మారుతున్నాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచితాల పేరుతో ప్రజలకు ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడం మంచిది కాదని పేర్కొంది. ఇలా చేయడం వల్ల ప్రజలు కష్టపడి పని చేయాలనే ఉద్దేశాన్ని కోల్పోతున్నారని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ ధర్మాసనం అభిప్రాయపడింది.

నిరాశ్రయుల కోసం ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా, ప్రజలకు ఉచిత సేవలు, రేషన్, నగదు సహాయం అందించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వాల ఉద్దేశం మంచిదే అయినప్పటికీ, దేశ అభివృద్ధికి ప్రజల కృషి అవసరమని, వారు కూడా ఆర్థిక స్వావలంబన దిశగా నడవాలని సూచించింది.

ఈ నేపథ్యంలో, కేంద్రం పట్టణ పేదరిక నిర్మూలన మిషన్‌ను కొనసాగిస్తున్నట్లు అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి కోర్టుకు తెలిపారు. నిరాశ్రయుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. అయితే, ఈ కార్యక్రమాలు ఎంతకాలం కొనసాగుతాయో స్పష్టత ఇవ్వాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు 6 వారాలకు వాయిదా వేసింది.

సామాజిక సంక్షేమానికి ఉచిత పథకాలు అవసరమే అయినప్పటికీ, అవి దేశ అభివృద్ధికి అడ్డంకిగా మారకూడదని కోర్టు సూచించింది. నిరాశ్రయులకు కేవలం ఉచిత సౌకర్యాలు అందించడమే కాకుండా, వారిని స్వయం సమృద్ధి దిశగా నడిపే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలను ప్రోత్సహించింది.

జగన్ 2.0 రీలోడ్ || Senior Journalist Bharadwaj About Ys Jagan || Chandrababu || Pawan Kalyan || TR