రాష్ట్రంలో దేవాలయాల భూముల అంశం మరోమారు చర్చకు వచ్చింది. మంత్రాలయం మఠానికి సంబంధించి కొన్ని భూములు అమ్మే విషయమై ప్రభుత్వ అనుమతి లభించడంతో, భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. కర్నూలు జిల్లాలో వుంది మంత్రాలయం. తెలంగాణలో వున్న కొన్ని భూముల అమ్మకానికి సంబంధించిన ప్రకటన మంత్రాలయం మఠం తరఫున కొద్ది రోజుల క్రితమే వచ్చింది.
అయితే, అమ్మకానికి అనుమతి వైఎస్ జగన్ హయాంలో వచ్చిందా.? చంద్రబాబు హయాంలో వచ్చిందా.? అన్నదిప్పుడు ‘రచ్చ’నీయాంశమైంది. అవును, చర్చనీయాంశాలు కాస్తా.. రచ్చకు దారి తీస్తున్నాయ్ మరి. అందుకే, ఇవి రచ్చనీయాంశాలవుతున్నాయి. చంద్రబాబు హయాంలోనే అనుమతులు వచ్చాయంటూ మంత్రాలయం మఠం ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో, విమర్శనాస్త్రాలు కాస్తా చంద్రబాబు వైపుకు తాజాగా మళ్ళాయి. అంతకు ముందు ఈ విమర్శలు వైసీపీ మీద వచ్చాయి. టీటీడీ భూముల విషయంలోనూ ఇదే గొడవ. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామికి భక్తులు ఇచ్చిన కానుకల్లో భూములు కూడా వున్నాయ్. ఆ భూముల్ని కొంతమంది ఆక్రమించేస్తున్నారు గనుక, మెయిన్టెన్స్కి వీలుకాని భూముల్ని టీటీడీ అమ్మకానికి పెట్టింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వుండగా అప్పటి టీటీడీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుందన్నది వైసీపీ ఆరోపణ. కాదు కాదు, వైఎస్ జగన్ హయాంలో దేవాలయాల భూములకు రక్షణ లేకుండా పోతోందనీ, అన్నీ అమ్ముకు తినేస్తున్నారని వైసీపీ మీద టీడీపీ అండ్ టీమ్ విరుచుకుపడింది.
ఏ రాయి అయితేనేం, పళ్ళూడగొట్టుకోవడానికి
అటు చంద్రబాబు అయినా.. ఇటు వైఎస్ జగన్ అయినా.. రాష్ట్రంలో ఏ ప్రభుత్వమైనా సరే, ఒకటే తీరు.. అన్నది బీజేపీ వాదన. బీజేపీతోపాటు, జనసేన పార్టీ ఈ దేవాలయాల భూముల అమ్మకాల వ్యవహారాలపై ఆందోళనలు చేస్తున్నాయి. చంద్రబాబునీ, వైఎస్ జగన్నీ నిలదీస్తున్నాయి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే, టీడీపీ – బీజేపీ కలిసి నాలుగేళ్ళు ప్రభుత్వాన్ని నడిపాయి.. కేంద్రంలో, రాష్ట్రంలో. ఆ తర్వాతే విడిపోయారు ఇద్దరూ. సో, ఈ అమ్మకాల నిర్ణయాల్లో బీజేపీ వాటాని తక్కువ చేసి చూడలేం. కానీ, ఆ బీజేపీ అటు చంద్రబాబునీ, ఇటు వైసీపీనీ ఒకే గాటన కట్టేస్తున్నాయి.
ఏంది స్వామీ.. ఈ ట్వీట్ల పోరు.?
బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి, సోషల్ మీడియా వేదికగా వరుస ట్వీట్లేశారు. ‘మీ హయాంలోనే వచ్చిన జీవో ఇది..’ అంటూ భూముల అమ్మకాలకు సంబంధించిన ఓ జీవోని ట్వీట్లో పేర్కొన్నారు సుబ్రహ్మణ్యస్వామి. ఇలాంటి వ్యవహారాల్లో చలికాచుకోవడం సుబ్రహ్మణ్యస్వామికి వెన్నతో పెట్టిన విద్య. పైగా, ఈ మధ్య ఆయన పదే పదే చంద్రబాబుని టార్గెట్ చేస్తున్నారు. మంచిదే, దేవాలయాలకు జరుగుతున్న అన్యాయం.. దేవాలయాల ఆస్తుల దోపిడీపై సుబ్రహ్మణ్యస్వామి స్పందించడాన్ని అభినందించి తీరాల్సిందే.
పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
చర్చికి వెళితే టిక్కెట్ వుండదు.. మసీదుకి వెళితే టిక్కెట్ అవసరం లేదు. కానీ, దేవాలయాలకు వెళ్ళాలంటే మాత్రం టిక్కెట్ కొనుక్కుని వెళ్ళాలి. ప్రముఖ దేవాలయాలకు సంబంధించి ఎందుకో ప్రభుత్వాలకి ఈ పైత్యం. ఏ ప్రముఖ చర్చి లేదా మసీదులకు టిక్కెట్లు పెట్టేంత ధైర్యం ఏ ప్రభుత్వమైనా చెయ్యగలదా.? చెయ్యదు, ఎందుకంటే హిందువులంటే చులకన.. అదే ముస్లింలు, క్రిస్టియన్లు అంటే.. అదో రకమైన భయం. వక్ఫ్ భూములూ ఆక్రమణకు గురవుతున్నాయి.. చర్చిల ఆస్తుల్ని దోచేసే రాజకీయ నాయకులూ వున్నారు. అయితే, అవి చాలా అరుదైన వ్యవహరాలే. ఫలానా మతం.. అని ప్రత్యేకంగా ప్రస్తావించడం ఎంతవరకు సమంజసం? అన్న విషయాన్ని పక్కన పెడితే.. గుడినీ, గుడిలోని లింగాన్నీ మింగేసే రాజకీయ నాయకులున్నంతకాలం.. దేవాలయాల ఆస్తులకు రక్షణ వుండదుగాక వుండదు.