పోలవరానికి జగన్‌ జోష్‌, కండిషన్స్‌ అప్లయ్‌.!

Polavaram project that came to the fore again

పేరులో వున్న ‘వరం’, రియాల్టీలో లేకుండా పోయింది పోలవరం ప్రాజెక్టుకి. ఎప్పుడో బ్రిటిష్‌ హయాంలో రూపుదిద్దుకోవాల్సిన ప్రాజెక్టు.. దశాబ్దాల తరబడి అన్యాయానికీ, అణచివేతకీ గురయ్యింది. పబ్లిసిటీ స్టంట్స్‌ విషయంలో ఒకరు ఎక్కువా కాదు, ఇంకొకరు తక్కువా కాదు.! వైఎస్‌ హయాంలో కాలువల తవ్వకాలతో ప్రాజెక్టుకి బీజం పడితే.. ఆ కాలువల తవ్వకం చుట్టూ నడిచిన రాజకీయం అంతా ఇంతా కాదు. వాటిల్లో పారిన అవినీతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చంద్రబాబు హయాంలో పట్టిసీమ ఎత్తిపోతల మీద పెట్టిన శ్రద్ధ పోలవరం ప్రాజెక్టుపై పెట్టలేదన్న విమర్శలున్నాయి. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ హయాంలోనూ ప్రాజెక్టు విషయమై వస్తున్న విమర్శలు తక్కువేమీ కాదు.

Polavaram project that came to the fore again
Polavaram project that came to the fore again

ఏటీఎం ఆరోపణలు ఏమయ్యాయ్‌.?

పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి కాలువల్లో అవినీతిని పారించారంటూ తెలుగుదేశం పార్టీ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై చిందులేసిన విషయం విదితమే. అయితే, ఆ అవినీతి నుంచి అర్థ రూపాయి కూడా వెనక్కి తీసుకొచ్చి, జనానికి చూపించిన పరిస్థితి లేదు. ఏ రాజకీయ నాయకుడూ, కాంట్రాక్టరూ జైలుకు వెళ్ళలేదు.. పోలవరం అవినీతికి సంబంధించి. చంద్రబాబు హయాంలో అయితే, ఏకంగా ‘ఏటీఎం’ ఆరోపణల్ని ప్రధాని నరేంద్ర మోడీ చేశారు. కానీ, ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టు నుంచి పావలా అవినీతిని కూడా కేంద్రం చూపించలేకపోయింది.

వేల కోట్లు.. కేంద్రం నుంచి వచ్చేదెలా.!

టీడీపీ అధికారంలో వున్నా, వైసీపీ అధికారంలో వున్నా.. పోలవరం ప్రాజెక్టు బాధ్యతను కేంద్రానికే అప్పగించేసి వుండాలి. కానీ, అలా జరగలేదు. కేంద్రం నిధులు విడుదలచేసేదాకా రాష్ట్రం ఎదురుచూడాల్సిన పరిస్థితి. రాష్ట్రం కొన్ని ప్రతిపాదనలు చేయడం, కేంద్రం తొలుత సరే అన్నట్లుగా వ్యవహరించి, ఆ తర్వాత కొర్రీలు పెట్టడం ఇదో ప్రసహనంగా మారిపోయింది. ప్రాజెక్టు నిర్మాణం జరిగిపోతోంది.. కానీ, నిధులు ఆ స్థాయిలో రావడంలేదు. అయినాగానీ, కేంద్రాన్ని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు నిలదీయలేకపోతున్నాయి.

ఇలాగైతే ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి.?

ప్రాజెక్టు పూర్తవ్వాలంటే.. కేంద్రం నుంచి ఇబ్బడిముబ్బడిగా నిధులు రావాలి. కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని, ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలి. నెలకి ఓ సారైనా కేంద్ర మంత్రులు, ప్రాజెక్టుని సందర్శించాలి. ప్రాజెక్టు భవిష్యత్తు గురించి రాష్ట్రంతో చర్చించాలి.. కానీ, ఇవేవీ జరుగుతున్నట్లు కనిపించడంలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాజాగా పోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. తాజా పరిస్థితిని బట్టి చూస్తే పనులు బాగానే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, పునరావాసం సంగతేంటి.? ముంపు ప్రాంతాల మాటేమిటి.? వీటికి కేంద్రం నుంచి వేల కోట్ల నిధులు రావాలి. అవి రాకపోతే, ప్రాజెక్టులో నీటి నిల్వ ఎలా సాధ్యం.?