పంచాయితీ ఎన్నికలంటే.. బలవంతపు ఏకగ్రీవాలు.. కొట్లాటలు.. ఇంకా చాలా చాలా.! అయితే, ఇప్పుడు కొత్త కథ నడుస్తోంది. ప్రభుత్వానికీ, రాష్ట్ర ఎన్నికల కమిషన్కీ మధ్య ఆధిపత్య పోరు. వైసీపీ గెలుస్తుందా.? టీడీపీ గెలుస్తుందా.? ఇంకో పార్టీ గెలుస్తుందా.? అన్నది కాదిక్కడ చర్చ. వైసీపీ ప్రభుత్వం గెలుస్తుందా.? ఎన్నికల కమిషన్ గెలుస్తుందా.? అన్నదే చర్చ. ఇంతకీ, రాష్ట్ర ప్రజలు ఈ మొత్తం ‘గొడవ’ గురించి ఏమనుకుంటున్నారు.? ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలోనే సమాధానం దొరుకుతోంది. ‘ప్రభుత్వం ఎందుకు మొండి పట్టుదలకు పోతోంది.?’ అన్న ప్రశ్న చాలామంది నుంచి వ్యక్తమవుతోంది. దాదాపు ఇదే ప్రశ్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ని ఉద్దేశించి కూడా దూసుకొస్తోంది. ‘ఎన్నికలు నిర్వహించేది ఎన్నికల కమిషన్ అయినప్పటికీ, బాద్యత ప్రభుత్వానిదే..’ అని స్వయానా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు. కానీ, ఇరు పక్షాల మధ్యా పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి కనిపిస్తోంది. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించే పని చేస్తున్నారు.
నిజానికి, అదికార వైసీపీకి.. ఎన్నికల్లో గెలుపోటములపై భయం లేదు. అసలు ఓటమి గురించిన ఆలోచనే లేదు. ఎందుకంటే, బోల్డన్ని సంక్షేమ పథకాలు.. రికార్డు సమయంలో తెరపైకి తెచ్చామన్నది ప్రభుత్వ పెద్దల వాదన. అందులో నిజం లేకపోలేదు కూడా. ఇటీవలే పేదలకు ఇళ్ళ పట్టాల కార్యక్రమం కూడా చేపట్టింది వైఎస్ జగన్ సర్కార్. దాంతో, పంచాయితీ ఎన్నికల్లో తిరుగులేని విజయం వైసీపీ పొంతమవుతుంది. అలాంటప్పుడు పంతానికి పోవాల్సిన అవసరమే లేదన్నది సాధారణ ప్రజానీకం వాదన. రాష్ట్ర ఎన్నికల కమిషన్తో అనవసరపు పంచాయితీ కారణంగా, రేప్పొద్దున్న ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే.. అది నైతిక ఓటమిగానే వైసీపీ భావించాల్సి వస్తుందేమోనని జనం అనుకుంటున్నారు. ‘ఎన్నికలు వద్దు మొర్రో.. అంటున్న పార్టీ, ఎలా ఎన్నికల్లో పోటీ చేస్తుంది.? బహిష్కరించేయొచ్చు కదా.. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేస్తే, వైసీపీ నైతికంగా ఓడిపోయినట్లే..’ అనే వాదనను రాజకీయ ప్రత్యర్థులు తెరపైకి తెస్తుండడం వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారుతోంది. ఉద్యోగులకు దాదాపుగా ఇంకో ఆప్షన్ లేదు.. ఇప్పుడెంతగా గింజుకున్నా రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సహకరించాల్సిందే. కాగా, పంచాయితీ ఎన్నికలు ప్రజల కోసం.. కానీ, ఆ ప్రజలకు అసలేం జరుగుతోందో అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితిని ఇంతకుముందెన్నడూ తాము చూడలేదనీ, ఎవరిది తప్పో తేల్చుకోలేకపోతున్నామని జనం వాపోతున్నారు.