వైరల్ అవుతున్న కేటీఆర్ ఓల్డ్ పిక్… సెటైర్స్ పీక్స్!

మిగిలిన దేశాల సంగతి కాసేపు పక్కనపెడితే మన దేశంలో రాజకీయ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే శ్రీరంగనీతులకు, అధికారంలోకి వచ్చిన తర్వాత వేసే డ్యాష్ వేషాలకు ఏమాత్రం పొంతన ఉండదనేది తెలిసిన విషయమే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే కబుర్లు.. ఆహో ఓహో అన్నట్లుగా ఉంటాయి. తీరా ఆ మాటలు నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే… జరిగే సీన్ టోటల్ రివర్స్ అన్నా అతిశయోక్తి కాదు!

అవును… ఇండియాలో రాజకీయ నాయకులు ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ఏయే విషయాలను అయితే తప్పుపడతారో.. ఏయే విషయాలకు అయితే వ్యతిరేకంగా మాట్లాడతారో.. అధికారంలోకి వచ్చిన అనంత్రం ఎగ్జాట్ గా వారు తప్పుపట్టిన, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించిన విషయాలనే నిస్సిగ్గుగా చేపడుతుంటారని అంటుంటారు! ఈ క్రమంలో తాజాగా కేటీఆర్ కు సంబంధించిన ఒక పిక్ వైరల్ అవుతోంది.

తాజాగా తెలంగాణ బహుజన సమాజవాదీ పార్టీ చీఫ్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ లో ఒక పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేశారు. ఆ ఫోటో లోని కేటీఆర్ చేతుల్లో ఒక ఫ్లకార్డ్ ఉంది. ఆ ఫ్లకార్డ్ లో ఒక కీలమైన పాయింట్ దర్శనమిస్తోంది.

కేటీఆర్ పట్టుకుని ప్రదర్శిస్తోన్న ఫ్లకార్డులో… “ప్రభుత్వ భూముల వేలం పాటను ఆపివేయాలి. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని మానుకోవాలి – టీఆరెస్స్” అని రాసి ఉంది. ఆ ఫ్లకార్డును రెండు చేతులతో పైకి ఎత్తిపట్టుకుని కేటీఆర్ ప్రదర్శిస్తున్నారు.

దీంతో… అది టీఆరెస్స్ గా ఉన్నప్పటి నినాదం.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి స్టాండ్.. ఇప్పుడు బీఆరెస్స్ గా మారిన తర్వాత లెక్క మారింది అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఇదే ఫోటోపై ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ స్పందించారు.

“హలో… కేటీఆర్ గారు.. గీ ఫోటో గుర్తుందా? తమరు ప్రతిపక్షంలో ఉంటే చెప్పేవి శ్రీరంగనీతులు. అధికారం లోకి వచ్చిన తర్వాత ఆ నీతులు ఎక్కడో కొట్టుకొని పోయినయి! ఐనా చెప్పిందల్లా చేయడానికి మీరేమన్నా సన్నాసులా (నాన్న గారి మాటల్లోనే)! మీరు మీ పత్రికల ద్వారా గతాన్ని తుడిచేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నప్పటికీ చరిత్రను మరచిపోయేంత సన్నాసులం మేం కాదు”

“75 ఏళ్ల నుంచి 99% ఉన్న బహుజనులు 1% ఉన్న ఆధిపత్య పాలకుల కు ఓట్లేసి గెలిపిస్తే పేదల భూములను కాపాడలేదు సరికదా అమాంతంగా మింగేసిండ్రు. 75 ఏళ్లలో ఏ ఆధిపత్య పార్టీలు తీర్చని లోటు, బీఎస్పీ అధికారం లోకి వచ్చిన వెంటనే పేదల భూములకు రక్షణ కల్పిస్తాం” అని పేర్కొన్నారు ఆర్.ఎస్.పి.! ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

కాగా.. తాజాగా తెలంగాణ సర్కార్ చేపట్టిన కోకాపేట భూముల వేలం రికార్డ్ స్థాయి ధరలు పకికిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎకరా 100 కోట్ల రూపాయల ధర పలికిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరో రెండు మూడు రోజుల్లో మోకిలా, బుద్వేల్ భూములను కూడా వేలం వేయనుంది తెలంగాణ ప్రభుత్వం.