Shubhanshu Shukla: అంతరిక్షంలో యోగా.. శుభాంశు శుక్లా సరికొత్త ప్రయోగం

భారతీయుడు అంతరిక్షంలో మరో అద్భుత ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు. యాక్సియోమ్-4 మిషన్‌లో పైలట్‌గా వ్యవహరించనున్న ఆయన, నాసా అనుమతితో స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్ష యాత్ర చేయనున్నారు.

2025 వసంతంలో ఈ ప్రయోగం ప్రారంభం కానుంది. ఇంతవరకు రాకేష్ శర్మ మినహా ఎవరూ అంతరిక్ష ప్రయాణం చేయలేదు. దాదాపు నలభై ఏళ్ల తర్వాత మరో భారతీయుడు ఈ ఘనత సాధించనున్న నేపథ్యంలో, శుభాంశు ప్రయాణంపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ మిషన్‌లో శుభాంశు ప్రత్యేకమైన ప్రయోగాలు చేయబోతున్నారు. శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో యోగాసనాలను ప్రదర్శించి, వాటి ప్రభావాన్ని పరిశీలించనున్నట్లు వెల్లడించారు. భారతీయ సంప్రదాయాన్ని అంతరిక్షంలో ప్రదర్శించేందుకు ఇది గొప్ప అవకాశం అని ఆయన భావిస్తున్నారు.

అంతేకాదు, తన ప్రయాణ అనుభవాలను ఫోటోలు, వీడియోల రూపంలో భారత ప్రజలతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అలాగే, సహ వ్యోమగాములకు ఇండియన్ వంటకాలు రుచి చూపించేందుకు ప్రత్యేకమైన ఆహార పదార్థాలను కూడా తీసుకెళ్లనున్నారు. ఈ మిషన్‌లో శుభాంశుతో పాటు పోలాండ్‌కు చెందిన స్లావోష్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపూ కూడా పాల్గొనున్నారు.

నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు నాయకత్వం వహించనున్నారు. వ్యోమగాములు మొత్తం 14 రోజులు ఐఎస్ఎస్‌లో గడిపి పలు ప్రయోగాలు నిర్వహించనున్నారు. ఈ ప్రయోగంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) భాగస్వామిగా ఉండటం విశేషం. భవిష్యత్తులో భారతదేశం చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌లోనూ శుభాంశు కీలక పాత్ర పోషించనున్నారు.ఈ ప్రయోగం విజయవంతమైతే, భారతదేశం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో మరింత గణనీయమైన స్థాయికి ఎదిగే అవకాశం ఉంది.

సమంత రెండో పెళ్ళి || Drector Geetha Krishna EXPOSED Samantha Affair || Naga Chaitanya, Sobhita || TR