కొత్త సర్వే… జగన్ – చంద్రబాబులకు ఉమ్మడి గుడ్ న్యూస్!

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ ఏపీ రాజకీయాల్లో సర్వేల సందడి మొదలైపోయింది. ఇందులో భాగంగా ఇప్పటికే విడుదలైన సర్వేల్లో దాదాపు అన్నింటి ఫలితాలు.. రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమంటూ ఫలితాలు వెల్లడించిన వేళ… తాజాగా మరో జాతీయ మీడియా సర్వే ఫలితాలు విడుదల చేసింది.

అవును… “ఇండియా టీవీ – సీ.ఎన్‌.ఎక్స్” జాతీయ న్యూస్‌ ఛానల్స్ నిర్వహించిన మరో సర్వే ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ రిజల్ట్స్ వైరల్ గా మారుతోన్నాయి. ఈ ఫలితాలు అటు జగన్ కు, ఇటు చంద్రబాబు కు కూడా గుడ్ న్యూస్ లు చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో పవన్ ప్రస్థావన లేకపోవడం కొసమెరుపు!

ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం… ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరోసారి తిరుగులేదని ఇండియా టీవీ-సీ.ఎన్.ఎక్స్. ఒపీనియన్ పోల్ తేల్చి చెప్పింది. కాకపోతే 2019 ఎన్నికల్లో వచ్చినంత భారీ ఫిగర్ అయితే రాదని అభిప్రాయపడింది. ఇందులో భాగంగా… రాష్ట్రంలో 25 లోక్‌ సభ స్థానాలు ఉండగా.. అందులో 18 చోట్ల వైసీపీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధిస్తారని పేర్కొంది.

ఇదే సమయంలో అనూహ్యంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కూడా గుడ్ న్యూసే చెప్పింది ఈ సర్వే! అలా గతవైభవంతో పోలిస్తే ఇది చిన్న గుడ్ న్యూసే కానీ… 2019 ఫలితాలతో చూస్తే మాత్రం భారీ గుడ్ న్యూస్ అనడం లో సందేహం లేదు. కారణం… గడిచిన ఎన్నికల్లో 2 ఎంపీస్థానాలు మాత్రమే టీడీపీ గెలుపొందింది.

అయితే… తాజా సర్వే ఫలితాల ప్రకారం.. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఏడు లోక్‌ సభ స్థానాలను గెలుచుకుంటారని తెలిపింది. అంటే… 2019లో గెలిచిన 3 కంటే మరో నాలుగు స్థానాలు ఎక్కువగా గెలిచే ఛాన్స్ ఉందని వెల్లడించింది.

ఈ వివరాలను బట్టి అసెంబ్లీ సీట్లను ఒకసారి అంచనా వేస్తున్నారు పరిశీలకులు. ఈ లెక్కల ప్రకారం… ఒక్కో లోక్ సభ నియోజకవర్గానికి సగటున 7 అసెంబ్లీ సెగ్మెంట్లను తీసుకుంటే… 2019లో 22 ఎంపీ సీట్లు గెలిచిన జగన్ 151 అసెంబ్లీ సీట్లు సాధించారు. దాదాపుగా సమానంగా! అదే సూత్రాన్ని ఇప్పుడు అప్లై చేస్తే… ఈసారి వైసీపీకి 18 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయని సర్వే స్పష్టం చేస్తోంది.

ఈ లెక్కన చూసుకుంటే… కాస్త అటు ఇటుగా 126 సీట్లు రావొచ్చన్నమాట. అంటే సీట్ల సంగతి కాసేపు పక్కనపెడితే ఎలా చూసుకున్నా వైసీపీ గెలుపు మరోసారి తధ్యం అని ఈ సర్వే చెబుతుందన్నమాట. ఇది ఏపీ అధికారపార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే విషయంగానే పరిగణించాలి!

ఇదే సమయంలో… ఈ సర్వే ఫలితాలు తమ్ముళ్లలో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కారణం… ఈసారి సుమారు 7 పార్లమెంట్ సీట్లు టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని సర్వే చెబుతోంది. ఈ లెక్కన చూసుకుంటే… ఒకటి రెండు సీట్లు అటు ఇటుగా అసెంబ్లీ సీట్ల విషయంలో ఈసారి చంద్రబాబు హాల్ఫ్ సెంచరీ చేయడం పక్కా అన్నమాట! అంటే 7 * 7 = 49 లెక్కప్రకారం!!

ఏపీలో ప్రధాన పార్టీల సంగతి అలా ఉంటే… రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ పార్టీల పరిస్థితి మాత్రం శూన్యం అని చెబుతోంది. అవును… తాజా సర్వే ఫలితాల ప్రకారం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండూ డకౌట్ అవుతాయని సర్వే అంచనా వేసింది.

ఇక్కడ గమనించాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఇండియా టీవీ-సీ.ఎన్‌.ఎక్స్ ఒపీనియన్ పోల్.. ఏపీలో రాబోయే ఎన్నికల్లో అత్యంత కీలకమైన అంశంగా భావిస్తున్న పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకపోవడం! దీంతో… బహుశా జనసేనను.. మిత్రపక్షం బీజేపీతో కలిపే పరిగణలోకి తీసుకుని ఉందేమో అని అంటున్నారు పరిశీలకులు.