ఇంగ్లాండ్ గడ్డపై మరోసారి టీమిండియాకు ఓటమి తప్పలేదు. క్రికెట్ యొక్క చారిత్రాత్మక మైదానం అయిన లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లండ్ జట్టు 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. భారత్కు ముందు ఇంగ్లండ్ ఉంచిన 193 పరుగుల చిన్న లక్ష్యం భారత్కి పెద్ద సవాల్ గా మారింది. మొదటి ఇన్నింగ్స్లో ఇరుజట్లు 387 పరుగుల వద్ద సమం కావడం ఈ మ్యాచ్ను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది. కానీ చివరి ఇన్నింగ్స్లో టీమిండియా బ్యాటింగ్ విఫలం అవడంతో పరాజయం తప్పలేదు.
భారత బ్యాటింగ్లో రవీంద్ర జడేజా మాత్రమే నిలకడగా ఆడి క్రీజులో నిలిచాడు. ఆఖరి వరకు పోరాడుతూ 61 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. కేఎల్ రాహుల్ 39 పరుగులు చేసి కొంత సహకరించాడు.. కానీ అది కూడా లాభం లేకుండా పోయింది. జడేజాకు తోడుగా నిలిచే మరో ఆటగాడు లేని కారణంగా భారత్ పరాజయం తప్పలేదు. మిగతా ఆటగాళ్లలో పంత్ 9 పరుగులు మాత్రమే చేయగా, యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. వాషింగ్టన్ సుందర్ ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. చివర్లో బుమ్రా 54 బంతులు ఆడినా కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. సిరాజ్ కూడా 4 పరుగులకే పరిమితమయ్యాడు. దీంతో మొత్తం భారత్ జట్టు 170 పరుగులకే ఆలౌటైంది, 193 పరుగుల లక్ష్యానికి కేవలం 23 పరుగుల దూరంలో ఆగిపోవడం అభిమానులకు తీవ్ర నిరాశను మిగిలించింది.
ఇంగ్లండ్ బౌలర్లు ఈ మ్యాచ్లో తమ సమర్థతను మరోసారి నిరూపించారు. ముఖ్యంగా స్వింగ్, లెంగ్త్ బంతులతో భారత్ టాప్ ఆర్డర్ను కుదేలు చేశారు. అండర్సన్, వూడ్, ఆర్చర్లు టీమిండియా బ్యాటర్లను కట్టడి చేశారు. ఆర్చర్ మూడు వికెట్లు పడగొట్టగా, బెన్ స్టోక్స్ మూడు వికెట్లు తీశాడు. తాజా విజయంతో సిరీస్లో 2-1తో ఇంగ్లండ్ ముందు ఆదిపత్యం సాధించింది. తదుపరి మ్యాచ్లో గెలిచి సిరీస్ను తిరిగి సమం చేయాల్సిన బాధ్యత భారత్పై ఉంది.
మరోవైపు జడేజా పోరాటం ఫ్యాన్స్కు ప్రేరణగా నిలుస్తోంది. గిల్, పంత్, రాహుల్ వంటి కీలక బ్యాటర్లకు వచ్చే మ్యాచ్లో స్థిరంగా ఆడాలని.. జట్టు విజయానికి దోహద పడాలని మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. అభిమానులు కూడా సిరీస్లో తిరిగి టీమిండియా పుంజుకోవాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. తదుపరి మ్యాచ్లకు జట్టు కాంబినేషన్, బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తే తప్ప టీమిండియాకు విజయం లభించదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
