రాధాకృష్ణ రూటే సప”రేటు”

రాధాకృష్ణ - ఎవరికన్నా చెప్పేందుకే నీతులు
 
తన దుర్రాతలతో, దుష్టబుద్దితో జగన్ మీద విషం చిమ్మడానికి, అదే సమయంలో ప్రజలు ఛీకొట్టిన తన కులనాయకుడు చంద్రబాబును పైకి లేపడానికి అలవాటు పడిన నీచప్రాణి రాధాకృష్ణ తన వారాంతపు గరళవిసర్జనలో సరికొత్త కోణాలను ప్రదర్శించారు…జగన్ రూటే సపరేటు అంటూ…అంశాలవారీగా అవధరిద్దాము.
 
“మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం ధరలను 75 శాతం పెంచారు. అది కూడా మద్యం ప్రియులు కోరుకున్న బ్రాండ్లు కాకుండా బూమ్‌ బూమ్‌, బామ్‌ బామ్‌ అంటూ ఎవరూ ఎప్పుడూ వినని బ్రాండ్లను ప్రవేశపెట్టారు. మద్యం ప్రియులను నిరుత్సాహపరచడానికే వారికి షాక్‌ కొట్టేలా ధరలు పెంచుతున్నట్టు ప్రకటించడం జగన్‌కే సాధ్యం.”
 
పాపం రాధాకృష్ణ…జగన్ యుక్తులతో మైండ్ బ్లాంక్ అయిపోయి దిగ్భ్రాంతి నుంచి కోలుకోలేకపోతున్నాడు.  మద్యం ధరలను పెంచడంలో ఇప్పుడు కొత్త ఏముందో రాధాకృష్ణకు తెలియడం లేదు.  తాను అధికారంలోకి వస్తే మద్యం ధరలను రెట్టింపు పెంచుతానని, ఆ విధంగా మద్యం పేదవారికి అందుబాటులో లేకుండా చేస్తానని తన పాదయాత్ర సమయంలోనే ప్రకటించిన విషయం రాధాకృష్ణ మట్టిబుర్ర మర్చిపోయింది.  జగన్ ఆలోచన ఒక్కరోజులోనే సత్ఫలితాలను ఇచ్చింది.  వైన్ షాపులు తెరిచిన రోజున ఎగబడి కొన్న మద్యప్రియులు మరునాడు పెరిగిన ధరలను చూసి గుండె ఠారెత్తిపోయి మద్యానికి దూరంగా ఉన్నారు.   
 
రాధాకృష్ణ తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఏమిటంటే, జపాన్ దేశంలో కార్మికులు యాజమాన్యానికి తమ నిరసన తెలియజేయాలనుకుంటే రోజుకన్నా మరో గంట ఎక్కువ పనిచేసి ఉత్పత్తిని పెంచుతారట.  ఆ పెరిగిన ఉత్పత్తికి డిమాండ్ లేక నష్టాలు వస్తాయన్న భయంతో యాజమాన్యం దిగివచ్చి కార్మికుల డిమాండ్స్ తీర్చుతాయట.  ఇక బ్రాండ్స్ గూర్చి రాధాకృష్ణ ప్రస్తావించారు.  అంటే…ఫలానా బ్రాండ్ మాత్రమే అమ్మాలని ఎక్కడైనా రూల్ ఉన్నదా?  రోజూ మార్కెట్ లోకి ఎన్ని కొత్త ఉత్పత్తులు రావడం లేదు?  ఇష్టమైన వాడు కొంటాడు లేకపోతె మానుకుంటాడు.  పాపం తెలుగుదేశం పార్టీవారి కంపెనీల  బ్రాండ్స్  దొరకడం లేదేమో?  అదే రాధాకృష్ణ ఏడుపుకు కారణం.  
 
****
“సోషల్‌ ఇంజనీరింగ్‌ను నమ్ముకున్న జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేషాన్ని రగిలింపజేసి ఆశించిన ఫలితాన్ని పొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే వ్యూహంతో ఆ సామాజికవర్గంపై కత్తి దూస్తూనే ఉన్నారు. కోస్తా జిల్లాల్లో కాపు సామాజికవర్గానికి, మిగతా వర్గాలకు మధ్య ఉన్న వైషమ్యాలను ఆసరాగా చేసుకుని.. తాజాగా ఆ వర్గాన్నీ పరోక్షంగా టార్గెట్‌ చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు కాపులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి మిగతా వర్గాలకు.. ముఖ్యంగా బీసీలకు దూరం అయిన విషయాన్ని గమనించిన జగన్మోహన్‌రెడ్డి అండ్‌ కో ప్రస్తుతం ఈ ఎత్తుగడను అనుసరిస్తోంది. ఈ క్రమంలో కమ్మ– కాపు సామాజికవర్గాలను వదులుకోవడానికి జగన్‌ సిద్ధపడ్డారని భావిస్తున్నారు.”
 
మళ్ళీ కులాల రొచ్చులోకి జొరబడ్డాడు రాధాకృష్ణ.  చంద్రబాబు అధికారంలో ఉండగా కేవలం తన సామాజికవర్గం వారికే అన్ని రకాల పదవులు, ఉద్యోగాలు ఇచ్చి ఇతర సామాజికవర్గాలవారిని ఎంత నిర్లక్ష్యం చేశారో రాష్ట్రం మర్చిపోలేదు.  ముఖ్యంగా బ్రాహ్మణ సామాజికవర్గం అంటే విషం కక్కిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల దురాగతాలు ఇంకా గుర్తున్నాయి.   
 
ఎస్సీలు ఎస్టీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అని ప్రశ్నించి ఆ వర్గాల మనసులను చంద్రబాబు క్షోభకు గురిచేశారు.  తోకలు కత్తిరిస్తా అని బెదిరించి నాయీబ్రాహ్మణులను అవమానించారు.  వంశపారంపర్య అర్చకులైన రమణదీక్షితులు లాంటివారిని నిర్దాక్షిణ్యంగా గెంటివేసి బ్రాహ్మణులను పరాభవించారు.  ఇక రాబోయే పదిహేనేళ్ళు మన కులం వారే అధికారంలో ఉండాలని ఆ మధ్య ఆత్మహత్య చేసుకున్న కోడెల శివప్రసాదరావు తమ కులసంఘం సభలో నోరుపారేసుకున్నారు.  కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ ను లేపేస్తారు అంటూ మొన్నే రాయపాటి సాంబశివరావు తన కులాహంకారాన్ని ప్రదర్శించారు. 
 
ఇక ముద్రగడ పద్మనాభం కాపులకు ఆరాధ్య నాయకుడు అని తెలిసీ కూడా ఆయనను, ఆయన కుటుంబాన్ని తీవ్రంగా హింసకు గురిచేశారు చంద్రబాబు.  ఒక్క తన సామాజికవర్గం వారిని తప్ప మిగిలిన అన్ని కులాలను చంద్రబాబు తన పాలనలో అవమానాలకు గురిచేసిన వైనం రాధాకృష్ణ మర్చిపోయి ఉండవచ్చు గాక….జనం మాత్రం మరువలేదు.  రాజకీయం అన్న తరువాత ఎవరి ఎత్తులు వారికి ఉంటాయి.  రాజకీయం అన్నది ఒక రణతంత్రం.  
 
***
“కష్టపడి, పట్టుబట్టి మరీ పరిశ్రమలు, సంస్థలు తీసుకువచ్చినప్పటికీ, వాటిని ఏర్పాటుచేసిన ప్రాంతంలో కూడా చంద్రబాబు  ఓడిపోయారు. ఏ రాజధానిని అయితే నమ్ముకున్నారో ఆ రాజధాని వల్ల గరిష్ఠంగా ప్రయోజనం పొందే కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు కూడా ఆయనను ఓడించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో కులం అనేది ప్రధాన సమస్యగా ఉందని గుర్తించడంలో విఫలమవడంతో కొందరివాడేనన్న అపప్రథను మూటగట్టుకున్నారు. ఫలితంగా చంద్రబాబు నమ్ముకున్న అభివృద్ధి, సంక్షేమం కూడా ఓటమి నుంచి ఆయనను కాపాడలేదు. పార్టీని, రాజకీయాన్ని గాలికి వదిలేయడం వల్ల భారీ మూల్యం చెల్లించుకున్నారు.”
 
ఒహోహోహో…ఏమి తెలివిడి?  ఏమి పరితాపం!!!  ప్రజాధనంతో ప్రత్యేకవిమానాలను వేసుకుని, పాతికమంది వందిమాగధులు వెంటరాగా ప్రపంచం మొత్తం విలాసపర్యటనలు చేసిన చంద్రబాబు పట్టుబట్టి మరీ పరిశ్రమలను, సంస్థలను తెచ్చారట!   తెలిసో తెలియకో మరొక రహస్యాన్ని కూడా రాధాకృష్ణ కక్కేశారు… అమరావతి ని రాజధానిగా చెయ్యడం ఆ రెండు జిల్లాలవారి ప్రయోజనాలకోసమే అని అంగీకరించారు.  ఆ రెండు జిల్లాల్లో మెజారిటీ వర్గం ఎవరిదో ఎవరికీ చెప్పాల్సిన పనిలేదు…సో…అమరావతి అనే భ్రమరావతి తన కులంవారికోసమే  అని మరోసారి స్పష్టం అయింది.
 
ఇక కులం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన సమస్య అని చంద్రబాబు గుర్తించలేదట!  ఎంత దారుణం?  రాజకీయాల్లో నలభై ఏళ్ల అనుభవం కలిగి, జీవిత చరమాంకంలోకి ప్రవేశించిన చంద్రబాబుకు ఎంత అవమానకరమైన స్టేట్మెంట్ ఇది!!! చంద్రబాబు కాలేజీలో చదువుతున్నప్పుడే తన కులం వాళ్ళను వెంటేసుకుని తిరిగేవాడు….తన కులం వాళ్ళతో కలిసి విశ్వవిద్యాలయంలోని కులచిచ్చు పెట్టిన ఘనుడు…పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు కులాల సమస్య తెలియదంటే….పృష్టంతో పగలబడి నవ్వాలి మరి!!!
 
****
“ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చాలా తెలివైనవాడు. తెలుగు ప్రజలపై తనదైన ముద్ర వేసిన దివంగత రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావులతో పోల్చితే జగన్మోహన్‌రెడ్డిది విభిన్న శైలి! ఎన్‌.టి.రామారావు ‘రాజకీయం’ తెలియని నిష్కల్మష నాయకుడు. ముఖ్యమంత్రులుగా ఒక్కొక్కరు ఒక్కో మోడల్‌ను అనుసరిస్తుంటారు. జగన్‌ మోడల్‌ మాత్రం ఇప్పటివరకు ఎవరూ అనుసరించలేదు.”
 
హమ్మయ్య…ఇన్నాళ్లకు ఒక సత్యాన్ని రాధాకృష్ణ ఒప్పుకున్నాడు.  జగన్ తెలివైన వాడట…ఆ సంగతి రాష్ట్రం మొత్తం ఏనాడో గ్రహించి అసెంబ్లీలో ఎనభై శాతం సీట్లు కట్టబెట్టారు.  చంద్రబాబును తరిమికొట్టారు.  ఆనాడే జగన్ తెలివి ఏమిటో గ్రహించి ఉన్నట్లయితే ఈరోజు ఇంత కుమిలిపోయే అవసరం కలిగేది కాదేమో!  జగన్ మోడల్ ను మాత్రం ఇప్పటివరకు ఎవ్వరూ అనుసరించలేదట….రాధాకృష్ణ తెలుసుకోవాల్సిన ఒక పాఠం ఏమిటంటే…ఏ రంగంలో అయినా “ట్రెండ్ ఫాలోయర్స్”  ఉంటారు.  అలాగే “ట్రెండ్ సెట్టర్స్” ఉంటారు.  జగన్ రెండో రకం వారు అని రాధాకృష్ణ గ్రహించడం అవసరం.  
 
మద్యం ధరలను ఏకంగా 75 శాతం పెంచే విషయంలో ముందు వెనుక ఆలోచించకుండా, ”పెంచిన ధరలతో మందుబాబులకు షాక్‌ కొట్టాలి” అని చెప్పి మరీ ధరలు పెంచిన గడసరితనం జగన్మోహన్‌రెడ్డి సొంతం.
 
“పేద ప్రజల సైకాలజీని ఔపోశన పట్టిన ఆయన.. సోషల్‌ ఇంజనీరింగ్‌ను కూడా మిళితం చేసి మరీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలను తరచుగా ఆత్మరక్షణలోకి నెడుతుంటారు. సోషల్‌ ఇంజనీరింగ్‌ను నమ్ముకున్న జగన్మోహన్‌రెడ్డి గత ఎన్నికలకు ముందు ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు సామాజికవర్గంపై ఇతర వర్గాలలో ద్వేషాన్ని రగిలింపజేసి ఆశించిన ఫలితాన్ని పొందారు.”
 
అబ్బాబ్బా.,..ఎంత కర్ణపేయంగా ఉన్నాయీ వాక్కులు!    శ్రీకృష్ణుడిని శిశుపాలుడు …. శ్రీరాముడిని రావణుడు…నరసింహుడిని హిరణ్యకశిపుడు స్తుతిస్తున్నట్లు లేదూ!!! వాహ్వా….అకారణంగా కేవలం కులగజ్జితో జగన్ ను  ద్వేషించే ఎవరికైనా ఈ గతి తప్పదేమో!  
 
***
“రెండున్నర దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో సీనియర్‌ నాయకులను ఢీకొని, డక్కామొక్కీలు తిన్న రాజశేఖర్‌రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమం– అభివృద్ధి అనే రెండు ప్రాధాన్యాంశాలను నిర్ణయించుకున్నారు. ముఖ్యమంత్రి అయ్యేనాటికి ఆయన అన్ని వర్గాల ఆమోదం పొందగలిగారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఏ ఒక్క వర్గంపైనా కక్షతో వ్యవహరించలేదు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ వంటి పథకాలకు రూపకల్పన చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు.   ప్రజల విషయానికి వచ్చేసరికి వివక్ష చూపలేదు.”
 
ఏమైందయ్యోయ్ రాధాకృష్ణ…ఈరోజు తండ్రికొడుకులకు ఒకేసారి భజన చేస్తున్నావు?  వైఎస్సార్ బతికి ఉండగా ఏనాడైనా ఇలాంటి మాటలు రాశావా?  వైఎస్ ను అప్రతిష్ట పాలుచెయ్యడానికి ఎన్నెన్ని నీచపు రాతలు రాశావు?  నీలాంటి క్షుద్ర జర్నలిస్టుల కారణంగానే కదా “ఆ రెండు పత్రికలు” అని వైఎస్సార్ పదేపదే ఎత్తిపొడిచేవాడు!  మరి రాజశేఖరరెడ్డి లా ప్రజలపట్ల వివక్ష చూపించకుండా చంద్రబాబు కూడా పాలనచేసి మరోసారి గెలవొచ్చు కదా!  ఎందుకు చంద్రబాబుకు సలహా ఇవ్వలేదు?  
 
****
“ఏతావాతా చంద్రబాబు మార్క్‌ పాలన కనిపించడం లేదని ప్రారంభంలోనే ప్రజల్లో అభిప్రాయం ఏర్పడినా ఖాతరు చేయలేదు. వేళాపాళా లేకుండా టెలికాన్ఫరెన్సులు, వీడియో కాన్ఫరెన్సులు, సమీక్షలు అంటూ గంటల తరబడి విసిగించడంతో అధికారులతోపాటు ఉద్యోగులు కూడా మళ్లీ దూరమయ్యారు. చివరకు తనకంటూ ఒక మోడల్‌ లేకుండా పాలన సాగించడంతో ఉభయభ్రష్టత్వం చెందారు.”
 
పాపం..చంద్రబాబు గారు రాధాకృష్ణ చెత్తపలుకును చదువుతారో లేదో తెలియదు…చంద్రబాబు ఉభయభ్రష్టత్వానికి కారణాలు కనుగొన్న రాధాకృష్ణకు అభినందనలు.   మొత్తానికి పదునాలుగేళ్ళు ముఖ్యమంత్రిత్వం వెలగబెట్టినా..చంద్రబాబు ఒక మోడల్ కాలేదు….మోడల్ లేదు…అంతేకాదు…మోరల్ లేదు అంటే ఇంకా సరిపోయేది!  
 
****
” విశాఖపట్టణంలో ఎల్‌జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్‌ లీకై 12 మంది మరణించిన దుర్ఘటన విషయమే తీసుకుందాం. మామూలుగా అయితే ఈ దుర్ఘటన జరిగినందుకు అధికార పార్టీ ఆత్మరక్షణలో పడాలి. అలాంటిది ప్రతిపక్షాలు నోరెత్తలేని పరిస్థితిని జగన్మోహన్‌రెడ్డి కల్పించారు.”
 
నాకు తెలియక అడుగుతాను రాధాకృష్ణా….పుష్కరాల ప్రారంభదినాన…చంద్రబాబు ప్రచారపిచ్చితో ముప్ఫయి మంది తొక్కిసలాటలో మరణించారు.  సుమారు రెండున్నర ఏళ్ళక్రితం కృష్ణానది పడవ ప్రమాదంలో ఇరవై రెండుమంది మరణించారు…అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందా?  అలాగే తూర్పుగోదావరి జిల్లాలో నగరం గ్రామంలో గ్యాస్ లీకై ఐదుగురో ఆరుగురో మరణిస్తే చంద్రబాబు ఆత్మరక్షణలో పడ్డారా?  మొన్న ఔరంగాబాద్ లో రైలు ప్రమాదం జరిగి పదిహేనుమంది మరణించారు.  కేంద్రం ఆత్మరక్షణలో పడిందా?  ప్రమాదాలు జరిగినపుడు ఎంత సత్వరం స్పందించాము బాధితులకు ఎంత వేగంగా సాంత్వన కలిగించాము అనేది ప్రధానం తప్ప శవరాజకీయాలు చెయ్యడం, తద్వారా లబ్ది పొందాలనుకోవడం నేరం కాదా?  
 
***
మొత్తానికి చూస్తే…రాధాకృష్ణ కళ్ళకు కమ్మిన పొరలు కరుగుతున్నట్లున్నాయి….జగన్ కు వ్యతిరేకంగా ఎంత విషం చిమ్మినా నమ్మే నాధుడు లేదని, చంద్రబాబుకు ఎంత జాకీలేసి లేపినా పైకి లేచే అవకాశం లేదని రాధాకృష్ణ గ్రహించినట్లున్నాడు!  అయినా నమ్మటానికి  మనం అంత వెర్రివాళ్ళం కాదు కదా…ఎంత ముసలిది అయినా సర్పానికి కాటువేసే బుద్ది పోతుందా?  చావబోతున్న నక్కసైతం దూరంలో కాస్త మాంసం కనిపిస్తే కొరకాలనే కోరుకుంటుంది!   
 
 
 
Ilapavuluri Murali Mohan Rao
Ilapavuluri Murali Mohan Rao

ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు