రాధాకృష్ణ పరమ రోతపలుకులు 

Weekend comment by RK
 
“జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాలి”
“షర్మిల, భారతి కొట్టుకోవాలి”
“విజయమ్మ, భారతి నిత్యం పోట్లాడుకోవాలి”
“చంద్రబాబు మహా మేధావి.  ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి” 
“వైసిపి చీలిపోవాలి”
“జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళాక బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం యుద్ధం జరగాలి”
“ఆ ఇద్దరికీ రాకుండా భారతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉన్నది”
 
****
 
నవ్వు వస్తున్నదా?  ఇవన్నీ జరగబోయే రాజకీయ పరిణామాలు కావండోయ్!   ఆంధ్రజ్యోతి సంపాదకుడు ప్లస్ యజమాని వేమూరి రాధాకరష్ణ గారు అపరాహ్నం వేళ పొట్టపగిలేట్లు పీకలదాకా నవకాయ పిండివంటలతో సుష్టుగా ఆరగించి, హంసతూలికాతల్పం మీద శయనించి గాఢనిద్రలో కంటున్న రంగురంగుల హరివిల్లు లాంటి మధుర స్వప్నాలు!
 
 
‘వేల కోట్ల రూపాయలను కైంకర్యం చేసిన వ్యక్తిని దూరంగా పెట్టవలసిన ప్రజలే మీరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని చెప్పడం ఏమిటి?” అని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి మాటలు విన్నప్పుడు నిజమే కదా? అని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్‌రెడ్డినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు”  అంటూ విలవిలలాడిపోతున్నారు రాధాకృష్ణ!  
 
జగన్మోహన్ రెడ్డి వేలకోట్ల రూపాయలను కైంకర్యం చేసాడని ఏ కర్ణపిశాచి గరికపాటివారి చెవిలో ఊదిందో మనకు తెలియదు.  జగన్ మీద లక్షకోట్ల ఆరోపణలు చేసి కేసులు పెట్టిన సిబిఐ ఎనిమిదేళ్ల తరువాత కూడా ఒక్క రూపాయి కూడా జగన్ కైంకర్యం చేసాడని నిరూపించలేక తలబద్దలు కొట్టుకుంటున్నది.  కేసులు పెట్టిన అధికారి ఉద్యోగానికి రాజీనామా చేసి పారిపోయి, మొన్నటి ఎన్నికల్లో ప్రజలతో తలంటించుకోబడ్డాడు.   పాపం…రాధాకృష్ణకు గరికపాటివారి మాటలు పరమాన్నంలా తోచాయి!   అందుకనే ఇకనుంచి ప్రజలు తమ అంతరాత్మను అనుసరించికాక, ప్రవచనకారుల సలహాలు, మెట్టవేదాంతాలు వింటూ ఓట్లు వెయ్యాలి కాబోలు! 
 

Read Alsoబయటపడుతున్న అమరావతి తెరలు ! 

 
అయిదేళ్లపాటు పాలించి మీ అనుభవంతో చక్కని రాజధానిని నిర్మించవయ్యా మగడా అని    ఆంధ్రులు అవకాశం ఇస్తే, దాన్ని దుర్వినియోగం చేసి, తన సామాజికవర్గంవారు ఉన్నచోట అమరావతి అనే మాయాబజారును నిర్మించి,  మయసభలో మాదిరిగా  లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు ఇంద్రజాలం గావించి, అస్మదీయులకు ముందుగానే ఉప్పూకారం అందించి నాలుగువేల ఎకరాలను కారుచౌకగా బినామీలకు, భృత్యులకు కట్టబెట్టేసి, రాష్ట్రంలోని పదకొండు జిల్లాల ప్రజలు తమ రక్తమాంసాలు ధారపోసి పన్నులు కడుతుంటే, ఆ డబ్బుతో ఒక్క అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి, మిగిలిన ప్రాంతాలకు చిప్ప చేతిలో పెడదామని చేసిన కుటిలయత్నాలను ప్రజలు గమనించి, కీలెరిగి వాత పెట్టి, అధికారం నుంచి తరిమేసి జగన్మోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించారు.   ఈ సంగతి గరికపాటివారికి తెలిసి ఉండదు…
 
“రాజధానిని మహా నగరంగా అభివృద్ధి చేసుకోవాలన్న ఆలోచనకు స్వస్తి చెప్పి ప్రజలు కూడా సంకుచితంగా ఆలోచించడమే అన్నింటికంటే విషాదకరం. విశాఖలో పది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మరుసటి సంవత్సరం నుంచి యేటా లక్ష కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని మంత్రి బొత్స తాజాగా ప్రకటించారు. ఆకర్షణీయమైన పథకాలను ప్రకటించి ప్రజలను మోసం చేసేవారు కూడా ఇటువంటి ఆకర్షణీయమైన పథకాన్ని ప్రకటించి ఉండరు.”
 
హయ్యో…”తాను వలచిందే రంభ…తాను మునిగిందే గంగ” అన్నట్లు..చంద్రబాబు గారు మెచ్చిందే రాజధాని…దాన్నే మహానగరంగా అభివృద్ధి చేసుకోవాలి…కాదంటే ప్రజలు సంకుచితంగా ఆలోచిస్తారు అని దుర్భాషలాడటానికి ఏమాత్రం సందేహించడు రాధాకృష్ణ!  ఇక బొత్స ప్రకటన మోసపూరితం అని ఆరోపిస్తున్న రాధాకృష్ణ ఒకప్పుడు చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ చదివిన మారిషస్ మంత్రిగారు “ఇలాంటి మాటలు మా దేశంలో చెబితే పిచ్చాసుపత్రిలో చేరుస్తారు లేదా జైల్లో పెడతారు”  అని మీడియాతో మాట్లాడి చంద్రబాబు మోసపు మాటలను, డాంబికాలను పరిహాసం చేసి పరువుతీసిన ఉదంతం రాధాకృష్ణకు గుర్తు రాకపోవడం మహా విషాదం కదా!  
 

Read Also `అల వైకుంఠ‌పుర‌ములో` మూవీ రివ్యూ

 
ఇక కులమతాలను రెచ్చగొట్టి జగన్ అధికారంలోకి వచ్చాడని రాధాకృష్ణ పెద్దపెట్టున రోదిస్తున్నాడు!   ఆంధ్రప్రదేశ్ లో ప్రజలమధ్యన కులచిచ్చు రగిలించి, ఒక్క కమ్మ సామాజికవర్గం ఒకవైపు, మిగిలిన అన్ని కులాలవారు మరొకవైపు అన్నట్లుగా ప్రజలమధ్యన కార్చిచ్చు పెట్టింది ఎవరో రాధాకృష్ణకు తెలియకనా?? కానీ, ఇసుకలో తలదూర్చిన ఉష్ట్రపక్షి బాపతుగాళ్లకు ఎవరు చెబుతారు?  
 
కోట్లరూపాయలు విలువచేసే స్థలాలు, పొలాలు పోయాయనే బాధ, ఇక ఈ జన్మలో చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడో కాడో అనే ఆందోళన,  అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారం, ప్రకటనల ద్వారా వచ్చే వందలకోట్ల రూపాయల ఆదాయం పోయిందనే ఆక్రోశం..జగన్ పట్ల నరనరానా నింపుకున్న  విద్వేషం…ప్రతి ఆదివారం ఇలా కక్కేస్తుంటాడు రాధాకృష్ణ!!  
 
సానుభూతి చూపిద్దాం!!
 
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు