“కమల”తో   గ్లాసు ప్రయాణం??

 
చిరంజీవి అనే ఒక సినిమా హీరో తాను ముప్ఫయి ఏళ్లపాటు సినిమారంగంలో సాధించిన అప్రతిహత  విజయాలను, ఆర్జించిన కీర్తి ప్రతిష్టలను ఆయుధాలుగా మలచుకుని “ప్రజారాజ్యం” అనే ఒక రాజకీయ పార్టీని స్థాపించి, నాడు నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని పెట్టుకుని, అప్పటివరకు ఏకచ్ఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని గుప్పిట పట్టిన కాంగ్రెస్ పార్టీని విసిరి బంగాళాఖాతంలో పారేసి, అధికారలక్ష్మిని తన ఆజానుబాహువుల్లొ బంధించిన రీతిని ప్రేరణగా తీసుకుని, తాను నందమూరి కన్నా అధికుడనని స్వైరకల్పనలలో  మునిగితేలి,  ఎన్నికల సమరాంగణంలో దూకి, కాళ్ళు విరగగొట్టుకుని, పోటీ చేసిన రెండు స్థానాల్లో తన సొంత గ్రామంలోనే దారుణంగా ఒక మహిళ చేతిలో పరాభవించబడి, ఆ తరువాత పార్టీని తన సొంత డబ్బుతో నడపడానికి మనస్కరించక, తుచ్ఛమైన రాజ్యసభ సభ్యత్వం కోసం, మహాసముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం చేసి, చివరకు రాజకీయ భ్రష్టుడై, అనామకుడై, మళ్ళీ సినిమాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న వైనం  గత పదేళ్ల కలం లో మనం చూసినదే.  
 
ఆ తరువాత ఐదేళ్లకు చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ అనే మరో హీరో జనసేన అనే రాజకీయ దుకాణాన్ని తెరిచారు.  చిరంజీవి ఉదంతాన్ని గుర్తుంచుకున్న రాజకీయపక్షులు ఏవీ జనసేన గూటిలో వాలడానికి సిద్ధపడలేదు.  దాంతో ఖంగు తిన్న పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సాహసించలేదు.   ఆ తరువాత రాష్ట్రం విడిపోవడంతో చంద్రబాబు విసిరిన బిస్కట్లకు ఆశపడి తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించేడు.   చంద్రబాబు కంసుడి పరిపాలన అందించినా, ప్యాకేజి మహాత్మ్యంతో ధృతరాష్ట్రుడిలా ఆ దురాగతాలను వీక్షించాడు.  పైగా ప్రతిపక్షంలో ఉన్న వైసిపిని తీవ్రంగా విమర్శించడం, జగన్ పట్ల విద్వేష విషాన్ని వెళ్లగక్కడం గావించేడు.  నాలుగేళ్లు నిండిన తరువాత బీజేపీతో, తెలుగుదేశంతో బంధాలను తెంచేసుకుని ఇద్దరినీ విమర్శించడం మొదలు పెట్టాడు.  ప్రత్యేక హోదా అనేది పాచిపోయిన లడ్డు అని, మోడీని, అమిత్ షాను తీవ్రంగా విమర్శించాడు.  
 
ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుని పోటీ చేసాడు.  రెండుచోట్ల పోటీ చేసిన పవన్ రెండుచోట్లా దారుణంగా ఓడించారు.  నాలుగైదు చోట్ల మినహా  జనసేన అభ్యర్థులకు ఎక్కడా డిపాజిట్లు కూడా రాలేదు.  తనకు సంపూర్ణాధికారం రాకపోయినప్పటికీ,  పాతిక సీట్లను గెలిచి ప్రభుత్వం ఏర్పాటులో తన పాత్ర కీలకం అవుతుందని స్వపించాడు.  చివరకు పగిలిన మట్టిపాత్ర మాత్రమే పవన్ కు మిగిలింది.  మెగాస్టార్ కుటుంబం నమ్మదగినది కాదనే  ప్రజల మదిలో ఏర్పడిన అభిప్రాయం పవన్ గాజు గ్లాసును భళ్ళున బద్దలు కొట్టింది.  అంతేకాక చంద్రబాబు నుంచి అవసరమైనప్పుడల్లా పవన్ పాకేజీలు అందుకుంటాడని,  జనసేన ఎన్నికల ఖర్చు మొత్తం చంద్రబాబే భరించాడని గుసగుసలు కూడా వ్యాపించాయి.  నిజానిజాలు ఏమైనప్పటికీ, పవన్ కళ్యాణ్ మీద ప్రజలకు జుగుప్స కలిగిందనేది యదార్ధం.  దానికితోడు జనసైనికులు ఉపయోగించే అత్యంత నీచమైన భాష, విమర్శకుల మీద ప్రయోగించే బూతులు ప్రజలకు జనసేన అంటే అసహ్యాన్ని కలిగించాయి.  ప్రజాస్వామ్యంలో ఎదుటివారి అభిప్రాయాలూ గౌరవించాలనే కనీస ఇంగితం కూడా జనసేన అభిమానుల్లో లోపించడంతో జనసేనను ఓటర్లు సమాధి చేశారు.  
 
Pawan Kalyan Meets BJP leader Nadda in Delhi
 
ఎన్నికల్లో ఓడిపోగానే..కాదు కాదు…ప్రజలనుంచి ఇంత దారుణ పరాభవం ఎదురు కాగానే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన పవన్ కళ్యాణ్ కు ప్రజలమధ్య తన విలువ, తనపై ప్రజలకున్న విశ్వాసం తెలిసిపోగానే ఎప్పుడెప్పుడు జనసేన అనే శిరోభారాన్ని దించుకోవాలా అని ఎదురు చూస్తున్నాడు.  దానికితోడు తనకు ప్యాకేజీలు ఇచ్చే చంద్రబాబు నాయుడు శాతం ప్రజలచేత తరిమివేయబడగానే ఇక ఆయనకు దిక్కుతోచలేదు.  ఇన్నాళ్లూ చంద్రబాబు ఇచ్చే పాకేజీలతో పార్టీని నడుపుతున్నారన్న ప్రజల సందేహాలు నిజమేనా అన్నట్లుగా ఎన్నికలు జరిగి ఏడాది తిరగకుండానే ఢిల్లీవెళ్లి బీజేపీ పాదకమలాలను ఆశ్రయించారు.  మొన్నటి ఎన్నికల్లో వామపక్షాలను వెంటేసుకుని, మాయావతి కాళ్లకు దణ్ణం పెట్టి, బీజేపీని అనరాని మాటలన్న పవన్ కళ్యాణ్ ఇపుడు వాటన్నింటినీ వాటంగా విస్మరించి బీజేపీతో కలిసి పనిచేస్తామని ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు!  విచిత్రం ఏమిటంటే, నాలుగు రోజుల క్రితమే, మంగళగిరిలో జరిగిన జనసేన విస్తృత సమావేశంలో బీజేపీ, వైసిపి మినహా మిగిలిన పార్టీలతో కలిసి పనిచేయాలని తీర్మానించారని వార్తలు వచ్చాయి.  ఎందుకంటే, బీజేపీ, వైసిపి ఎపుడు అడిగితె అప్పుడు జనసేనుడికి పాకేజీలు ఇవ్వవు.  చంద్రబాబు ఒక్కడే జనసేన పాలిట కల్పతరువు.  చంద్రబాబును వదులుకోవడం జనసేనలో ఎవ్వరికీ ఇష్టం లేదు. 
 
మరి ఇపుడు తన పార్టీలో చర్చ లేకుండానే నేరుగా బీజేపీతో పొత్తు కుదుర్చుకుని వచ్చిన పవన్ బీజేపీతో కలిసి పని చేస్తాడా లేక కొన్నాళ్ళాగి బీజేపీలో జనసేనను నిమజ్జనం చేస్తాడా అనేది ఆసక్తికరమైన ప్రశ్న.  చిరంజీవి ఘనకార్యాన్ని గుర్తుచేసుకుంటున్న చాలామంది విశ్లేషకులు మరో రెండు మూడు మాసాల్లో డబ్బుల్లేవు అనే సాకుతో జనసేనను బీజేపీలో విలీనం చేసే అవకాశాలే ఎక్కువ అని భావిస్తున్నారు.  ఏమైనప్పటికీ జనసేన అనేది ఒక విఫలప్రయోగంగా చెప్పక తప్పదు.  జనసేన కలయికతో బీజేపీ కూడా భ్రష్టు పట్టడం ఖాయం.  
 
 
Ilapavuluri Murali Mohan Rao
 
ఇలపావులూరి మురళీ మోహన రావు 
సీనియర్ రాజకీయ విశ్లేషకులు