6 నెలలకు 18 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండు మంజూరు
(యనమల నాగిరెడ్డి)
విభజన వల్ల ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేక సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నదని,కేంద్రం శీతకన్ను వేయడం వల్ల మరిన్ని ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతినిత్యము చెపుతుంటారు. రెవిన్యూ లోటు, ఆర్థిక ఇబ్బందులు, ఆదాయవనరులు తగ్గిపోవడం లాంటి అంశాలు రాష్టాన్ని పట్టి పీడిస్తున్నాయని చంద్రబాబు శెలవివ్వడం సర్వసాధారణం. దీని కంతా ‘కేంద్రమే’ కారణమని ఆయన అంటారు కూడా.
తన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం తోడుగా తాను కాబట్టే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్నానని కూడా చంద్రబాబు చెపుతారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విజయవాడను, తన కలల రాజ్యంగా ఉండి, తనకు అత్యంత ప్రీతిపాత్రమైన సింగపూర్ దేశాన్ని “గాలి ప్రయాణం ద్వారా” కలపడంకోసం అక్షరాలా 18కోట్లా 35లక్షలా 23వేలా 320 రూపాయలు ఇండిగో విమానయాన సంస్థకు కట్టపెట్టడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు ఇండిగో విమానయాన సంస్థకు, ఎపి ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీకి మధ్య నవంబర్ లో ఒప్పందం కుదిరింది.
ప్రభుత్వం నవంబర్ 27న “ఎనర్జీ, ఇన్ఫ్రా స్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ (ఎయిర్ పోర్ట్స్) డిపార్ట్మెంట్” ద్వారా జారీ చేసిన జీఓ నంబర్ 156 మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇండిగో విమానయాన సంస్థ 90 సీట్ల సామర్థ్యం ఉన్న విమానాన్ని వారానికి రెండు లేదా నెలకు 9 సర్వీసుల చొప్పున ఆరునెలలపాటు “విజయవాడ-సింగపూర్” మధ్య నడపదానికి అంగీకరించింది. ఈ క్రమంలో సింగపూర్ నుండి తిరిగి వచ్చేటప్పుడు తగినంత మంది ప్రయాణీకులు లేకుంటే “వయబిలిటీ గ్యాప్ ఫండ్” క్రింద ఆ నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించడానికి అంగీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కొక్క సీటుకు 18,881 రూపాయల చొప్పున 90 సీట్లకు 16,99,280 రూపాయల చొప్పున వారానికి రెండు మార్లకు 33,98,550 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మొత్తం నెలకు9 సార్లు చొప్పున ఆరు నెలలకు 54 ట్రిప్ లు తిరగాలని, అందుకు నెలకు 3 కోట్లా 6 లక్షలు చొప్పున ఆరు నెలలకు 18. 36 కోట్లు కేటాయిస్తూ ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇండిగో విమానయాన సంస్థకు “వచ్చిన(నిండిన) సీట్లు” పోను మిగిలిన సీట్లకు అంటే ఖాళీ సీట్లకు నష్టపరిహారం క్రింద సీటుకు 18881 రూపాయ చొప్పున ఈ మొత్తం నుండి ప్రభుత్వం ఇండిగోకు చెల్లించడానికి అంగీకారం కుదిరింది. అందులో భాగంగా మొదటివిడతగా ప్రభుత్వం 3,0587,220 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ క్రింద ఇండిగోకు చెల్లించడానికి విడుదల చేసింది. ప్రతి 15 రోజులకు ఇండిగో సంస్థ బిల్లు పెట్టాలని, ఆ మేరకు సంస్థకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది.
సింగపూర్ సంస్థలకు చెందిన ప్రతినిధులు, బాబు గారి అస్మదీయులు సింగపూర్ నుండి నేరుగా విజయవాడకు రావడానికి ఇంత మొత్తం ప్రభుత్వం చెల్లించాలా? అక్కడి నుండి వచ్చే వారు ఇతర అంతర్జాతీయ విమానాశ్రయాల నుండి విజయవాడకు రావచ్చు. మరి నేరుగా రావడానికి, లింక్ విమానం ద్వారా రావడానికి కొంత సమయం ఎక్కువ పట్టవచ్చు. రాష్ట్ర పర్యటనకు వచ్చే వారికి ఆ మాత్రం వేచి ఉండే ఓపిక లేకపోతె రాష్ట్రాభివృద్ధికి వారేం చేయగలరని? వారు వేచి ఉండే ఈ అతి తక్కువ కాలాన్ని తగ్గించడానికి, రాష్ట్రం తీవ్ర ఆర్థిక కష్టాలలో ఉన్నపుడు ఇంత ఖర్చు చేయడం అవసరమా? అని “తెలుగురాజ్యం ప్రతినిధికి జీవో ఇచ్చిన మేధావులు ప్రశ్నిస్తున్నారు.
